కరోనా మహమ్మారి మరో ప్రతిభావంతుడైన తెలుగు దర్శకుడిని పొట్టనపెట్టుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ చిత్రాన్ని రూపొందించిన శ్రావణ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వి.ఎన్. ఆదిత్య ‘మనసంత నువ్వే’, ‘శ్రీరామ్’; శోభన్ ‘వర్షం’ చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన శ్రవణ్ ఆ తర్వాత ‘ప్రియుడు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తిరిగి కో-డైరెక్టర్ గా, రచయితగా తన కెరీర్ ను కొనసాగించారు. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ‘ఎక్స్ పైరీ డేట్’ వెబ్ సీరిస్ కు శ్రవణ్ రచన సహకారం అందించడంతో పాటు అందులో నటించారు కూడా. కొద్ది కాలం క్రితం వాక్సిన్ వేయించుకున్న శ్రవణ్… తనకు కరోనా సోకినా, అది పోస్ట్ వాక్సిన్ ప్రభావం అని భావించారని తెలుస్తోంది. ఆ పైన శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురుకోవడంతో కరోనా పరీక్షలు చేయించగా, పాజిటివ్ అని తేలిందట. కానీ తగిన సమయంలో చిక్సిత్స లభించకపోవడంతో నిన్న ఉదయం గుండెపోటు వచ్చిందని, రాత్రి ఆయన మరణించారని సన్నిహితులు తెలిపారు. శ్రవణ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రవణ్ మరణం పట్ల తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు దర్శకులు సంతాపం తెలియచేశారు.
దర్శకుడు శ్రవణ్ కరోనాతో కన్నుమూత!
