ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సినిమాల షెడ్యూల్స్ మాత్రం పరిమితమైన బృందంతో జరుగుతున్నాయి. చిత్రం ఏమంటే… ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘థ్యాంక్యూ’ టీమ్ కు బ్రేక్ పడిపోయింది. ఇప్పటికే హీరో నాగచైతన్య, హీరోయిన్ రాశీ ఖన్నాపై దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ ఇటలీ షెడ్యూల్లో పాల్గొనాల్సింది. కానీ అనుకున్న దానికంటే ఒక రోజు ఆలస్యంగా ఆయన బయలుదేరాడు. దురదృష్టం ఏమంటే.. ఇటాలియన్ ప్రభుత్వం ఇప్పుడు భారతీయులను తమ దేశం రావడానికి అంగీకరించడం లేదు. దాంతో ‘థ్యాంక్యూ’ షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. అలానే సునీల్ పై ‘పుష్ప’కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన ఈ చిత్రబృందం కూడా షూటింగ్ ను రద్దు చేసుకుందట. ఇక గీతా ఆర్ట్స్ లో బన్నీ వాసుకు కరోనా వచ్చి తగ్గింది. దాంతో వాళ్ళ సంస్థకు సంబంధించిన చిత్రాల షూటింగ్స్ బంద్ చేశారు. మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించకపోయినా… స్వచ్ఛందంగానే మన తెలుగు నిర్మాతలు షూటింగ్స్ కు విరామం ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి చోట మాత్రమే కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి.
‘థ్యాంక్స్’ టీమ్ కు ఇటలీ ప్రభుత్వం సారీ!
