NTV Telugu Site icon

సోనూసూద్ కు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలంటున్న బ్ర‌హ్మాజీ!

ప‌ద్మ అవార్డుల‌కు పేర్ల‌ను సిఫార్స్ చేయ‌మంటూ కేంద్రం కోరుతోంద‌నే వార్త‌ను పి.టి.ఐ. వార్త సంస్థ ఇటీవ‌ల తెలియ‌చేసింది. సెప్టెంబ‌ర్ 15వ‌ తేదీలోగా త‌మ అభిప్రాయాల‌ను ప్ర‌జ‌లు తెలుపాల‌ని చెప్పింది. దాంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ రేంజ్ లో రెస్పాండ్ అవుతున్నారు. కొంద‌రు కొంటె కుర్రాళ్ళు స‌ర‌దా కామెంట్స్ పెడుతుంటే… దీనిని సీరియ‌స్ గా తీసుకున్న వారు మాత్రం సిన్సియ‌ర్ గా త‌మ మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. ప్ర‌ముఖ తెలుగు న‌టుడు బ్ర‌హ్మాజీ అయితే… ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని సోనూసూద్ కు ఇవ్వాల‌ని గ‌ట్టిగా కోరుతున్నారు. తన ప్ర‌పోజ‌ల్ ను బ‌ల‌ప‌రిచేట్ట‌యితే రీ-ట్వీట్ చేయ‌మ‌ని బ్ర‌హ్మాజీ కోరారు. దాంతో అనేక‌మంది బ్ర‌హ్మాజీ ట్వీట్ ను రీట్వీట్ చేయ‌డం మొద‌లెట్టారు. ఇది సోనూ సూద్ దృష్టికీ చేరింది. దాంతో సోనూసూద్… `135 కోట్ల మంది భార‌తీయుల ప్రేమే నాకు పెద్ద అవార్డు. దానిని ఇప్ప‌టికే పొందాను. మీ అభిమానానికి ధ‌న్య‌వాదాలు“ అని తెలిపాడు. కరోనా క‌ష్ట‌కాలంలో ఆప‌ద్భాంద‌వుడిగా దేశ ప్ర‌జ‌ల ముందు నిలిచిన సోనూసూద్ కు ఏ అవార్డు ఇచ్చినా… అది త‌క్కువే అవుతుందన్న‌ది మెజారిటీ జ‌నం అభిప్రాయం.