Celebrity Updates: ఒకప్పుడు సెలబ్రిటీల ప్రెగ్నెన్సీ, పెళ్లి, బేబీ బర్త్ వంటి వ్యక్తిగత విషయాలు ఎయిర్ పోర్ట్ , ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లలో తీసిన ఫోటోలు చూసి సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమ జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలను ఎప్పుడు, ఎలా, ఎవరికి చెప్పాలో సెలబ్రిటీలే నిర్ణయించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వచ్చాక ఈ మార్పు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది తారలు గర్భవతి అయినా, బేబీ పుట్టినా, పెళ్లి చేసుకున్నా… ముందు తమ సోషల్ మీడియా ఖాతాల్లోనే పోస్ట్ చేసేస్తున్నారు. అభిమానులతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చేసరికి, అనవసర పుకార్లు, ఊహాగానాలు కూడా తగ్గిపోతున్నాయి. బాలీవుడ్లో దీపికా-రణవీర్, ఆలియా-రణబీర్, కియారా-సిద్ధార్థ్ లాంటి జంటలు తమ శుభవార్తలు సోషల్ మీడియాలోనే పంచుకున్నారు. దక్షిణాది సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ బాగా నడుస్తోంది.
ఇక నయనతార, విఘ్నేష్ శివన్ ఈ విషయంలో చాలా స్పెషల్. 2022లో సరోగసీ ద్వారా కవల పిల్లలు పుట్టిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టకుండా, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలతో చెప్పేశారు. పిల్లల పేర్లు ఉయిర్ రుద్రోనీల్, ఉలగ్ దైవిక్ అని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఫోటోలు, క్యూట్ మెమొరీస్ ను సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు కన్నడ సినిమాలో యష్-రాధికా పండిట్ కూడా తమ రెండో బిడ్డ వచ్చిన వార్తను చాలా క్యూట్గా, కుమార్తె ఐరా ద్వారా తయారు చేసిన వీడియోతో అభిమానులకు తెలియజేశారు. కావ్య గౌడ కూడా తన బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. రీసెంట్ గా ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్లో, సమంత తన గర్భం కారణంగా నటన నుండి తాత్కాలిక విరామం తీసుకోవడం గురించి మాట్లాడి ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా అంటే కేవలం అభిమానులతో మాట్లాడే వేదిక కాదు… తమ పర్సనల్ జీవితంలోని మధుర క్షణాలను నేరుగా వెల్లడించే బెస్ట్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. దీంతో అభిమానులతో మరింత దగ్గర అనుబంధం పెంచుకుంటున్నారు సెలబ్రిటీలు. అందుకే ఇప్పుడు పాపరాజీ ఫోటోల కంటే… సెలబ్రిటీలు తామే పోస్ట్ చేసే శుభవార్తలకే ఎక్కువ హైప్ వస్తోంది.

