Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్

Bethlehem Kudumba Unit

Bethlehem Kudumba Unit

Bethlehem Kudumba Unit: మలయాళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గిరీష్ ఏడీ. ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ తో మరో ప్రేమకథతో ముందుకు వస్తున్నారు. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2026 ఆగస్టు 21న ఓణం పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ హీరో నివిన్ పౌలీ తన సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశా రు. పోస్టర్ విడుదలైన వెంటనే అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఓణం సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కోనుంది. అదే సమయంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘ఖలీఫా’, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ చిత్రాలు కూడా విడుదల కానుండటంతో మలయాళ బాక్సాఫీస్‌లో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది.

‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కథ ఎమోషనల్ ప్రేమకథగా సాగుతుంది. ఈ చిత్రాన్ని ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు భావనా స్టూడియోస్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇక నివిన్ పౌలీ విషయానికి వస్తే, ఆయన ఇటీవల ‘ప్రతిఛాయ’ చిత్రంలో కనిపించారు. ఒక టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ తన తండ్రి మరణం వెనుక ఉన్న కుట్రను ఛేదించే కథతో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన రాఘవ లారెన్స్, రవి మోహన్‌లతో కలిసి ‘బెంజ్’ చిత్రంలో నటిస్తుండగా, నయనతారతో కలిసి చేస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’ విడుదల కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మమితా బైజు కెరీర్ కూడా వేగంగా ముందుకు సాగుతోంది. ‘ప్రేమలు’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు తలపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మమితా బైజు, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.