Anumana Pakshi Trailer: ‘డీజే టిల్లు’తో టాలీవుడ్లో తనదైన కామెడీ మార్క్ చూపించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచిస్తూ తన జీవితాన్ని తానే కన్ఫ్యూజ్ చేసుకునే ఓ వ్యక్తి చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాలో రాగ్ మయూర్ సన్నీ అనే క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఏ విషయంలోనూ ఈజీగా నమ్మకం కుదరకపోవడం, ప్రతి విషయానికి ఓ కారణం వెతకడం, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకోవడం అతడి క్యారెక్టర్లోని లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఓవర్థింకింగ్ వల్ల సన్నీ ఎదుర్కొనే పరిస్థితులే సినిమాలో కడుపుబ్బ నవ్వించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లోనూ రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సన్నీ ప్రశాంతత కోసం కాశ్మీర్కు వెళ్లినప్పుడు మెరిన్ ఫిలిప్ పోషించిన అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలైన సమయంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఓ పోలీస్ ఆఫీసర్ సన్నీని వెంటాడటం మొదలుపెట్టడంతో అసలు సమస్య ఏంటనే ప్రశ్న మొదలవుతుంది. సన్నీ నిజంగా ఏదైనా తప్పు చేశాడా? లేక అతడి అనుమానాలే అతన్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టాయా? కాశ్మీర్లో జరిగిన అసలు కథ ఏంటి? అనే అంశాల చుట్టూ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. కామెడీతో పాటు క్రైమ్, సస్పెన్స్, డార్క్ కామెడీ టచ్ కూడా ఉండటంతో సాధారణ కామెడీ సినిమాలకు భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక ‘డీజే టిల్లు’ తర్వాత విమల్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘అనుమాన పక్షి’పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు అదే తరహాలో మరో విభిన్నమైన క్యారెక్టర్ను రాగ్ మయూర్తో చేయించగా, ఈసారి కామెడీతో పాటు మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ను కూడా కలిపినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
‘సినిమా బండి’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ ఈ చిత్రంలో తొలిసారి సోలో హీరోగా కనిపిస్తున్నారు. సన్నీ పాత్రలో అతడి ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఓవర్థింకింగ్ కామెడీ ట్రైలర్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటించగా, అజయ్, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, మస్త్ అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

