Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?

Aditya Dhar (2)

Aditya Dhar (2)

Aditya Dhar: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ ఘన విజయంతో బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను తనదైన స్టైల్ తో తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈసారి ఆయన దృష్టి ఇండియన్ హిస్టరీలో కీలక పాత్ర పోషించిన ఓ యోధుడి జీవితంపై పడినట్లు సమాచారం రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై కీలక విషయాన్ని కూడా వెల్లడించారు. అస్సాం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అహోం సేనాపతి ‘లచిత్ బోర్ఫుకాన్’ జీవితగాథను వెండితెరపై ఆవిష్కరించే ఆలోచనతో దర్శకుడు ఆదిత్య ధర్‌ను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. ఈ హిస్టారికల్ పాత్రను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఆదిత్య ధర్‌తో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ చర్చలు కూడా సానుకూలంగా సాగినట్లు సమాచారం. తదుపరి దశలో కథ, చారిత్రక అంశాలు, నిర్మాణ వ్యయం, షూటింగ్ కు అనువైన ప్రదేశాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు దర్శకుడు ఆగస్టులో అస్సాంను సందర్శించనున్నారని హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ పర్యటన తర్వాతే సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ అస్సాం వీరుడి నేపథ్యం ఏమిటి ?

(1622 – 1672) భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని అహోం రాజ్యానికి (ప్రస్తుత అస్సాం) చెందిన ఒక అసమాన పరాక్రమవంతుడైన సైన్యాధిపతి లచిత్. 1671లో బ్రహ్మపుత్ర నదిపై జరిగిన చారిత్రాత్మక సరాయిఘాట్ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్య భారీ సైన్యాన్ని ఓడించి, వాళ్ళని అస్సాంలోకి అడుగు పెట్టనీకుండా విజయవంతంగా అడ్డుకున్న వీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అహోం రాజు చక్రధ్వజ సింఘా ఆయన ప్రతిభను గుర్తించి సైన్యంలో అత్యున్నత సైనిక పదవి అయిన ‘బోర్ఫుకాన్’ బిరుదుతో గౌరవించారు. ఆయన స్వయంగా యుద్ధరంగంలోకి దూకి సైనికులలో ధైర్యాన్ని నింపి మొఘలులను గెరిల్లా, నౌకా దళ వ్యూహాలతో చిత్తుచేశారు. ఈ చారిత్రక విజయానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీని అస్సాంలో ‘లచిత్ దివస్’ గా ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా, భారతదేశపు ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లో ప్రతి ఏటా ఉత్తమంగా రాణించిన క్యాడెట్‌కు ‘లచిత్ బోర్ఫుకాన్ గోల్డ్ మెడల్’ బహుకరించి ఆయన వీరత్వాన్ని గౌరవిస్తారు.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు. హీరో ఎవరు, నిర్మాణ సంస్థ ఏది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు. అయితే ‘ధురందర్’ విజయానంతరం ఆదిత్య ధర్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతున్న నేపథ్యంలో, ఈ ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం నిజమైతే బాలీవుడ్‌లో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.