Bipasha Basu: ఫిట్నెస్పై ఎంతో శ్రద్ధ చూపించే బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుకు ఊహించని షాక్ ఎదురైంది. కొత్తగా తెరిచిన ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు కనిపించాయంటూ ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె ఏకంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే దృష్టికి తీసుకెళ్లారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సెప్టెంబర్ 10న బిపాషా బసు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో కొత్తగా తెరిచిన ఇసోప్యూర్ ప్రొటీన్ పౌడర్ డబ్బాలో చిన్న చిన్న పురుగులు ఉన్నట్లు ఆమె చూపించారు. తన వేలిపై కూడా ఓ చిన్న పురుగును చూపిస్తూ, డబ్బా మొత్తం ఇలాంటి పురుగులతో నిండిపోయిందని ఆమె ఆరోపించారు. ఈ వీడియోతో పాటు ఉత్పత్తి నాణ్యతపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బిపాషా బసు మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండేకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. కల్తీ, నాణ్యత లేని వస్తువులు ఉండకుండా చూడటానికి ఆయనే తమకు ఏకైక ఆశ అన్నట్టుగా ఆమె పోస్టులో పేర్కొన్నారు. ఆహార భద్రత విషయంలో తుకారాం ముండే ఇటీవల చేపడుతున్న తనిఖీలు, చర్యల నేపథ్యంలోనే బిపాషా ఆయనను నేరుగా ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
తుకారాం ముండే ప్రస్తుతం మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఆహార నాణ్యత, కల్తీపై తనిఖీలు, చర్యల కారణంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవల నటి శ్వేతా తివారీ కూడా తనకు వచ్చిన డ్రింక్ ఆర్డర్లో బొద్దింక కనిపించిందంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి తుకారాం ముండేను ట్యాగ్ చేశారు. బిపాషా బసు చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు ప్రొటీన్ సప్లిమెంట్ల నాణ్యతపై మరోసారి చర్చకు తెరలేపాయి. ఫిట్నెస్ కోసం రోజూ ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగించే వారు వాటి ప్యాకేజింగ్, సీల్, బ్యాచ్ వివరాలు, గడువు తేదీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. మరోవైపు బిపాషా బసు ఇటీవల సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకున్న బిపాషాకు 2022లో కుమార్తె దేవి జన్మించింది. ఆమె చివరిగా 2020లో డేంజరస్ వెబ్ సిరీస్లో కనిపించారు. రీసెంట్ గా ఆమె హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న ‘బరాబంకి’ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్తో తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది.

