West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!

Mosquitoes

Mosquitoes

West Nile Fever: కేరళలో భౌగోళిక పరిస్థితులు, నిరంతరం తేమతో కూడిన వాతావరణం, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకల వల్ల కొత్త వైరస్‌లు, అరుదైన వ్యాధులు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో ‘వెస్ట్ నైల్ జ్వరం’ (West Nile fever) కలకలం రేపుతోంది. ఎర్నాకులం జిల్లాలో ఈ జ్వరం బారిన పడి తాజాగా 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేసింది. మృతుడిని ఆలూవా సమీపంలోని కడంగల్లూర్ నివాసి మురళీధరన్‌గా గుర్తించారు. ఆయన సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ జిల్లాలో వెస్ట్ నైల్ జ్వరంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇక ఈ వ్యాధి దోమల ద్వారా వస్తుందని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయని తరచూ వింటుంటాం. చూస్తుంటాం. కానీ కేరళలో వెస్ట్ నైల్ జ్వరం వంటి మరో ప్రాణాంత వ్యాధి సైతం వస్తుందని తాజాగా స్పష్టమైంది.

వెస్ట్ నైల్ జ్వరం ఎలా వస్తుంది?

ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం.. ‘ఫ్లేవివైరస్’ (Flavivirus) అనే వైరస్ వల్ల ఈ వెస్ట్ నైల్ జ్వరం వస్తుంది. సాధారణంగా వలస పక్షులలో కనిపించే ఈ వైరస్, అవి ఉన్న ప్రాంతాల్లోని దోమలకు సోకుతుంది. ఆ సంక్రమిత దోమలు మనుషులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. అయితే.. ఈ వ్యాధి ఓ మనిషి నుంచి మరో మనిషికి నేరుగా సంక్రమించదని అధికారులు స్పష్టం చేశారు. దోమ కాటుకు గురి కాకుండా చూడటమే నివారణ మార్గమని తేల్చి చెప్పేశారు. ఇక, ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి వేడి పెరగడం, మెడ బిగుసుకుపోవడం, ప్రవర్తనలో మార్పులు, గందరగోళం, పాక్షికంగా లేదా పూర్తిగా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ గనుక తీవ్రమైతే అది నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మెదడు వాపునకు గురయ్యే ‘ఎన్సెఫలైటిస్’ (Encephalitis), అలాగే మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రక్షణ పొరలు వాపునకు గురయ్యే ‘మెనింజైటిస్’ (Meningitis) వంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పిల్లలు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.

×
×
Ad

మురికి నీరు, మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు, చిత్తడి నేలలు, వరి పొలాలు, పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగిన ప్రాంతాలలో సంతానోత్పత్తి చేసే ‘క్యూలెక్స్’ (Culex) రకం దోమల ద్వారానే ఈ వైరస్ ప్రధానంగా వ్యాపిస్తుంది. ఇవే కాకుండా ఇళ్ల పరిసరాల్లో పడేసిన పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, నీరు నిలిచే ఇతర వస్తువులలోనూ ఈ రకమైన దోమలు గుడ్లు పెడతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దోమల నివారణకు ప్రజలంతా సహకరించాలని జిల్లా వైద్య అధికారి కోరారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను తొలగించడం, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టడం, దోమతెరలు వాడటం, కిటికీలు-ద్వారాలకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దోమల సంచారం ఎక్కువగా ఉండే తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో కాళ్లు, చేతులు పూర్తిగా కప్పేసేలా లేత రంగు దుస్తులు ధరించాలని, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలని సూచించారు.