NTV Telugu Site icon

Breast Milk For Sale: అమృతం లాంటి తల్లిపాలు.. అమ్మకానికా?

Milk Sale

Milk Sale

డబ్బులిచ్చి కొనటానికి తల్లిపాలు ఎక్కడైనా దొరుకుతాయా అంటే లేదనే సమాధానమే వస్తుంది. అమృతం లాంటి అమ్మపాలను అంగట్లో సరుకుగా మార్చలేదని చాలా మంది భావిస్తున్నారు. కానీ మన దేశంలో రొమ్ము పాలకు కూడా రేటు కడుతున్న ఒక సంస్థ ఉందంటే నమ్మబుద్ధికాదు. దాని పేరు నియోలాక్టా లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. మాతృమూర్తి క్షీరాన్ని సైతం మార్కెట్‌ వస్తువుగా మార్చి లాభాలు ఆర్జిస్తున్న ఇలాంటి కంపెనీ ఇండియాలో తప్ప ఆసియాలోని మరే దేశంలోనూ లేకపోవటం గమనార్హం, సిగ్గుచేటని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నతల్లి పాలను కమర్షియలైజ్‌ చేయటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావటంతో ఆ ఆర్గనైజేషన్‌ లైసెన్స్‌ని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రద్దు చేసింది. అయితే అనంతరం ఆ అథారిటీయే నిర్వహించిన తనిఖీలో నియోలాక్టా మదర్‌ మిల్క్‌ని ఇంకా మార్కెట్లో అమ్మకానికి పెడుతూనే ఉన్నట్లు గుర్తించారు. ‘నారీ క్షీర'(బ్రెస్ట్‌ మిల్క్‌) బ్రాండ్‌ నేమ్‌తో ఈ ఉత్పత్తిని విక్రయించేందుకు ఆ సంస్థ 2021 నవంబర్‌లో ఆయుష్‌ లైసెన్స్‌ తీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తేలింది.

ఈ సంస్థను 2016లో కర్ణాటకలోని బెంగళూరులో స్థాపించారు. డైరీ ప్రొడక్టుల కేటగిరీలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ నుంచి అనుమతి తీసుకుంది. కానీ తల్లిపాలను కూడా సేకరించి ఓ డైరీ ప్రొడక్ట్‌ మాదిరిగా అమ్ముకోవటానికి పర్మిషన్‌ ఇవ్వటం పట్ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా (బీపీఎన్‌ఐ) ప్రతినిధి నుపుర్‌ బిడ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే నియోలాక్టా ఎండీ సౌరబ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ తమ కంపెనీకి హ్యూమన్‌ మిల్క్‌ స్పేస్‌ సప్లయింగ్‌ టెక్నాలజీలో విశేష అనుభవం ఉందని, మొట్టమొదటి మిల్క్‌ బ్యాంకును ఆస్ట్రేలియాలో ఏర్పాటుచేశామని చెప్పుకొచ్చారు.

Devendra Fadnavis: అమరావతి కెమిస్ట్ హత్య కేసు.. అంతర్జాతీయ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా

గత ఐదేళ్లలో తాము 450 ఆస్పత్రుల్లో 51 వేలకు పైగా నెలలు నిండని శిశువులకు తల్లి పాలు అందించామని అన్నారు. అయితే స్వచ్ఛందంగా ఇచ్చిన తల్లిపాలను అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అందించాలి. తల్లులు పాలిచ్చే పరిస్థితిలో లేని బిడ్డలకు ఈ పాలు పట్టాలి. నిజానికి మిల్క్‌ బ్యాంకులను లాభాపేక్షలేని సంస్థలుగా నడుపుతారు. ఈ సంస్థలు సహజంగా ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగా ఉంటాయి. తల్లులు దానం చేసిన పాలను పేద శిశువులకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. కొద్దోగొప్పో డబ్బున్నవాళ్లకైతే 50 మిల్లీ లీటర్ల తల్లిపాలకు నామమాత్రంగా వందల్లో వెల కట్టొచ్చు.

ఈ తరహా మిల్క్‌ బ్యాంకులు మన దేశంలో 80కి పైగా ఉన్నాయి. కానీ నియోలాక్టా 300 మిల్లీ లీటర్ల పాలకు ఏకంగా 4,500 రూపాయలు వసూలు చేస్తోంది. పాల పౌడర్‌ని కూడా ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లతోపాటు సొంతగా సేల్స్‌ చేస్తోంది. నెలలు నిండని పిల్లలకు రోజుకి 30 మిల్లీ లీటర్ల పాలు చాలు. పూర్తిగా బయటి పాల మీదే ఆధారపడ్డ బిడ్డలకు రోజుకి 150 మిల్లీ లీటర్ల పాలు సరిపోతాయి.

అయితే నియోలాక్టా ఎవరి వద్ద నుంచైతే పాలు సేకరిస్తోందో వాళ్లకు డబ్బులిస్తోందా? లేక ఉచితంగానే సేకరించి అధిక ధరలకు అమ్ముకుంటోందా అని నేషనల్‌ నియోనాటాలజీ ఫోరం(ఎన్ఎన్‌ఎఫ్‌) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సిద్ధార్థ్‌ రామ్‌జీ ప్రశ్నించారు. కానీ నియోలాక్టా సంస్థ ప్రభుత్వ నిబంధనలన్నీ, నైతిక విలువలన్నీ తొంగలో తొక్కి అమ్మపాలను సొమ్ము చేసుకుంటున్నట్లు ఓ పరిశోధనలో తేటతెల్లమైంది. ఈ వ్యవహరంపై వివరణ కోరేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖను సంప్రదించగా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదని ఒక ప్రముఖ దినపత్రిక పేర్కొంది.

Pakistan: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 19మంది దుర్మరణం