Walking After Meals: భోజనం చేసిన తర్వాత నడవడం ఆరోగ్యానికి మంచిదా? ఎంతసేపు నడవాలి? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం చేసిన తర్వాత తేలికపాటి నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా భోజనం చేసిన 30 నిమిషాల లోపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటంతో పాటు జీవక్రియ (మెటబాలిజం) మెరుగుపడుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు, బరువు నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది.
అయితే భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం, జాగింగ్ చేయడం లేదా కఠినమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి చర్యలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందువల్ల భోజనం తర్వాత తేలికపాటి నడకకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, భోజనం చేసిన కొద్ది నిమిషాలకే నడక ప్రారంభించడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత 30 నుంచి 60 నిమిషాల వరకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో నడక ప్రారంభిస్తే కండరాలు గ్లూకోజ్ను శక్తిగా వినియోగించుకుంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా అదనపు కొవ్వు పేరుకుపోయే అవకాశాలు కూడా తగ్గుతాయి.
మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల పాటు నడవడం వల్ల భోజనానంతర రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు రోజుకు మూడు సార్లు 10 నిమిషాల చొప్పున నడవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) కూడా సూచిస్తోంది. చిన్న చిన్న నడకలే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలవని పేర్కొంటోంది. అయితే భారీ భోజనం చేసిన వెంటనే నడవడం మంచిది కాదని డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల భోజనం పరిమాణాన్ని బట్టి నడక సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

