Moong Dal Idli Recipe: మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువగా తింటాం. చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు మధ్యాహ్నం, రాత్రి అన్నం తింటుంటారు. ఉదయం మాత్రం ఇడ్లీలు, దోశలు లాంటి టిఫిన్లు తింటుంటారు. అయితే.. ఈ టిఫిన్లలోనూ బియ్యం పిండి వాడతారు. దీంతో మూడు పూటలా బియ్యం తిన్నట్లు అవుతుంది. అందుకు ఇప్పుడు మినప్పప్పు, బియ్యంతో చేసే సంప్రదాయ ఇడ్లీకి ప్రత్యామ్నాయంగా ఉండే ఆరోగ్యకరమైన పెసరపప్పు ఇడ్లీ ట్రై చేద్దాం. నానబెట్టిన పెసరపప్పుతో, తాలింపు సుగంధాలతో తయారయ్యే ఈ ఇడ్లీకి గుజరాతీ ఢోక్లా నుంచి ప్రేరణ లభించింది. బియ్యం ఆధారిత వంటకాలు తినాలనిపించని వారికి ఇది మంచి ఆప్షన్. ఇది స్పైసీ పచ్చి చట్నీ, రెడ్ చట్నీ లేదా మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం తేలికగా కానీ పొట్ట నిండేలా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్గా ఇది ఉపయోగపడుతుంది.
READ MORE: Jowar Laddu Recipe: పిల్లలకు శక్తినిచ్చే ఆరోగ్యకరమైన ‘జొన్న లడ్డూలు’.. ఇంట్లోనే చిటికెలో చేసేయండి!
కావాల్సిన పదార్థాలు:
పెసరపప్పు – 1 కప్పు
పెరుగు – 1 కప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – 1 టీ స్పూన్
శనగపప్పు – ½ టీ స్పూన్
మినప్పప్పు – ½ టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – కొద్దిగా
అల్లం (సన్నగా తరిగినది) – 1 ఇంచు ముక్క
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి) – 3
క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – ¼ టీ స్పూన్
పొట్టు రవ్వ – 1 కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్ (రుచికి సరిపడా)
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
ఈనో ఫ్రూట్ సాల్ట్ – 1 టీ స్పూన్
జీడిపప్పు – అలంకరణ కోసం
తయారీ విధానం:
మొదట పెసరపప్పును కడిగి 2 గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసి పెరుగు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించాలి. ఇప్పుడు క్యారెట్ తురుము, పసుపు వేసి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు లైట్గా వేయించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పెసరపప్పు పిండిలో కలపాలి. ఉప్పు వేసి అవసరమైన కన్సిస్టెన్సీకి కలపాలి. రవ్వ బాగా నానేందుకు 20 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్లను నూనెతో గ్రీస్ చేసి జీడిపప్పు పెట్టి పిండిని పోయాలి. స్టీమర్లో పెట్టి సుమారు 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. అంతే ఆరోగ్యకరమైన, మెత్తగా పొంగిన పెసరపప్పు ఇడ్లీ రెడీ.. వేడి వేడి చట్నీతో లాగిస్తే అద్భుతంగా ఉంటుంది.
