Beetroot Pachadi: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. శరీరంలో రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నిత్యం బీట్రూట్ను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
అయితే దీని సహజసిద్ధమైన తీపిదనం, మట్టి వాసన లాంటి ప్రత్యేకమైన ఫ్లేవర్ వల్ల పిల్లలే కాదు, పెద్దలు కూడా కూరలు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఫలితంగా ఎన్నో అద్భుతమైన పోషకాలున్న ఈ సూపర్ఫుడ్ను చాలామంది దూరం పెడుతుంటారు. అలాంటి వారి కోసం బీట్రూట్తో రుచికరమైన, నోరూరించే పచ్చడిని తయారు చేసుకోవచ్చు.
కారం, పులుపు, తాలింపు సువాసనలతో కలిపి చేసే ఈ రోటి పచ్చడిలో బీట్రూట్ వాసన ఏమాత్రం తెలియదు. బీట్రూట్ అంటే ఇష్టం లేని వారు సైతం ఒక్క ముద్ద తింటే మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా, చపాతీ, దోశ లేదా పెరుగన్నంలోకి నంజుకున్నా ఈ పచ్చడి అద్భుతమైన కాంబినేషన్గా నిలుస్తుంది. తక్కువ సమయంలో, నిమిషాల్లో తయారయ్యే ఈ కమ్మని బీట్రూట్ పచ్చడి రెసిపీని ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
* బీట్రూట్ ముక్కలు: 2 కప్పులు (రెండు మీడియం సైజు దుంపలు)
పచ్చిమిర్చి: 2
* ఎండుమిర్చి: 4 (3 వేయించడానికి, 1 తాలింపుకి)
* వెల్లుల్లి రెబ్బలు: 5
* చింతపండు: చిన్న నిమ్మకాయ సైజులో సగం
* చక్కెర లేదా బెల్లం: 1 టీస్పూన్
* పసుపు: ¼ టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: తగినంత
తాలింపు కోసం:
* శెనగపప్పు: 1 టీస్పూన్
* మినప్పప్పు: 1 టీస్పూన్
* ఆవాలు: ½ టీస్పూన్
* జీలకర్ర: ½ టీస్పూన్
* ఇంగువ: చిటికెడు
* కరివేపాకు: ఒక రెమ్మ
తయారీ విధానం:
ముందుగా బీట్రూట్ను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక బీట్రూట్ ముక్కలు వేసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు కలుపుతూ మగ్గనివ్వాలి. బీట్రూట్ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, 3 ఎండుమిర్చి వేసి మిర్చి చక్కగా వేగే వరకు ఫ్రై చేసి స్టవ్ కట్టేయాలి.
ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర (లేదా బెల్లం) వేయాలి. చక్కెర వేయడం వల్ల తీపి రాదు, కానీ పచ్చడి రుచి సమతుల్యంగా కుదురుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా (కోర్స్గా) గ్రైండ్ చేసుకోవాలి. అదే పాన్లో కొద్దిగా నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి వేయించాలి.
చివరగా చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆపి, ఈ పోపును పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఈ పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్లో పెడితే 3 నుండి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

