UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31, 2026 సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యూపీఎస్సీ విడుదల చేసిన ప్రకటన నంబర్ 08/2026 ప్రకారం వైద్య, న్యాయ, శాస్త్రీయ, పరిశోధన, అమలు విభాగాలకు చెందిన పలు కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో అత్యధికంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఢిల్లీలో ఉన్న ప్రముఖ వైద్య సంస్థల కోసం స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 37 పోస్టులు ఈ విభాగంలోనే భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల్లో నియోనాటాలజీ విభాగంలో 13, ఎండోక్రినాలజీలో 10, క్లినికల్ హెమటాలజీలో 9, న్యూక్లియర్ మెడిసిన్లో 3, పల్మనరీ మెడిసిన్లో 3, పీడియాట్రిక్ కార్డియాలజీలో ఒక పోస్టు ఉన్నాయి. అదనంగా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషలిస్ట్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు.
వైద్య రంగంతో పాటు ఇతర కీలక విభాగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. న్యాయ శాఖలో సూపరింటెండెంట్ (లీగల్), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో ప్రాసిక్యూటర్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ), వ్యవసాయ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్లో కూడా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలు గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ గెజిటెడ్ కేటగిరీలకు చెందినవి. ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పే లెవల్ 11తో పాటు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ (ఎన్పీఏ) కూడా ఉంటుంది. అయితే ప్రైవేట్ ప్రాక్టీస్కు అనుమతి ఉండదు. ఇతర పోస్టులకు పే లెవల్ 10, 8, 7 ప్రకారం జీతభత్యాలు వర్తిస్తాయి.
పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితి 30, 35 లేదా 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అలాగే బెంచ్మార్క్ దివ్యాంగులకు అదనంగా 10 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది. ముందుగా యూపీఎస్సీ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ (ORA) పోర్టల్లో నమోదు చేసుకుని యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ (URN) పొందాలి. అనంతరం సంబంధిత పోస్టుకు దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో వెబ్క్యామ్ ద్వారా లైవ్ ఫొటో తీయించుకోవడం తప్పనిసరి. అలాగే విద్యార్హతలు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, అనుభవ సర్టిఫికెట్లు, సంతకం వంటి పత్రాలను పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.25గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూలై 31, 2026 సాయంత్రం 6 గంటలు. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత మార్పులు లేదా ఉపసంహరణకు అవకాశం ఉండదని యూపీఎస్సీ స్పష్టం చేసింది. అందువల్ల దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలు, పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచించింది.

