West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 18 రోజుల కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. యూఏఈ చమురు నిలయాలపై డ్రోన్ దాడులు, బెహ్రెయిన్లో ఎమర్జెన్సీ, హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగాయి. తాజాగా 18 రోజుల విరామం తర్వాత ఇరాన్, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా జరిగిన దాడులతో గల్ఫ్ రీజియన్ అట్టుడుకుతోంది.
పౌర నౌకలపై అమెరికా దాడి? ఇరాన్ ఆరోపణ
ఇరాన్ సరిహద్దుల్లో సరకు రవాణా చేస్తున్న రెండు పౌర నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని ఇరాన్ మీడియా సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము కేవలం వాణిజ్య నౌకలకు రక్షణగా హోర్ముజ్ జలసంధి గుండా ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ఇరాన్ చేస్తున్న దాడుల వార్తలు ‘కల్పితం’ అని అమెరికా స్పష్టం చేసింది. ఇదే సమయంలో సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఇది హోర్ముజ్ జలసంధిని బైపాస్ చేసే కీలకమైన పైప్లైన్ కేంద్రం. ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీనికి తోడు ఎమిరేట్స్ తీరంలో ఒక సరకు రవాణా నౌక కూడా తగలబడినట్లు బ్రిటీష్ సైన్యం ధృవీకరించింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన బెహ్రెయిన్ ప్రభుత్వం దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటించింది. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. “హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడి చేస్తే ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం” అని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే దక్షిణ కొరియా నౌకపై కూడా దాడి చేసిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమెరికా, యూఏఈలు యుద్ధం అనే ‘మొసలి గుంట’లో పడకూడదని హితవు పలికారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఈ సమస్యకు సైనిక పరిష్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధి మూతపడితే భారత్ వంటి దేశాలకు ఎల్పీజీ (LPG), చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ఇప్పుడు చైనా సహాయాన్ని కూడా కోరుతోంది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జనరల్ డాన్ కేన్ ఈ రోజు (మంగళవారం) ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వారి ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
