Vladimir Putin: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత విషయంలో చర్చ జరుగుతోంది. రష్యాలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని, పుతిన్కు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల రష్యా సైన్యంలోని పలువురు టాప్ అధికారుల హత్యలు జరగడం, దేశంలో సైనిక తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉండటంతో క్రెమ్లిన్ అప్రమత్తమైంది. అసలు ఏం జరిగిందంటే..
నిఘా నీడలో సొంత సిబ్బంది
CNN నివేదిక ప్రకారం.. పుతిన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్న రష్యా భద్రతా సంస్థలు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే సిబ్బందిపై కూడా నిఘా పెంచాయి. పుతిన్ వద్ద పనిచేసే ఫోటోగ్రాఫర్లు, బాడీగార్డులు, వంట మనుషులు ఇంటర్నెట్ సదుపాయం లేని సాధారణ ఫోన్లను మాత్రమే వాడాలని ఆదేశించారు. ఈ సిబ్బంది ఎవరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సులు, రైళ్లు)లో ప్రయాణించకూడదని కఠిన నిబంధనలు విధించారు. ఇకపై అధ్యక్షుడిని కలవడానికి వచ్చే వారిని రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
టాప్ జనరల్ హత్యతో మొదలైన కలకలం
గత డిసెంబర్లో రష్యాకు చెందిన ఒక టాప్ జనరల్ హత్యకు గురవ్వడం భద్రతా విభాగాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన తర్వాత రష్యా రక్షణ శాఖ అధికారుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఎదురుదెబ్బలు, దేశంలో ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత పుతిన్ పాలనకు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్పై కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రాణగండం ఉందన్న సమాచారంతో పుతిన్ తన పర్యటనలను భారీగా తగ్గించుకున్నారు. సాధారణంగా ఆయన నివసించే మాస్కో ప్రాంతం, సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య ఉండే వాల్దాయ్ విల్లాకు వెళ్లడం మానేశారు. ఆయన వెళ్లే ప్రదేశాల సంఖ్యను భద్రతా అధికారులు కుదించారు. మొత్తానికి రష్యాలో అంతర్గతంగా ఏదో కుట్ర జరుగుతోందని, అది పుతిన్ పదవికే కాకుండా ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
