అమెరికా అధ్యక్షుడు Donald Trump, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి Benjamin Netanyahu మధ్య విభేదాలు మరింత తీవ్రంగా మారినట్లు తెలుస్తోంది. మీడియా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం, లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విస్తరించడంపై ట్రంప్, నెతన్యాహును ఫోన్లో తీవ్రంగా మందలించినట్లు సమాచారం. ఇరాన్తో శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్పై దాడులను నిలిపివేయాలని కోరుతూ ఆయన నెతన్యాహుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆక్సియోస్ నివేదిక ప్రకారం, ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అమెరికా అధికారి వెల్లడించిన వివరాల మేరకు, ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడుతూ, “నీకు పూర్తిగా పిచ్చి పట్టింది. నేను లేకపోతే నువ్వు ఇప్పటికి జైలులో ఉండేవాడివి. నేను నీ రాజకీయ జీవితాన్ని కాపాడుతున్నాను. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటోంది” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో, నెతన్యాహుతో ఫలవంతమైన చర్చ జరిపినట్లు పేర్కొన్నారు. బీరుట్పై ఎలాంటి కొత్త సైనిక చర్యలు చేపట్టబోరని, ఇప్పటికే కదులుతున్న దళాలను వెనక్కి పిలిచినట్లు తెలిపారు.
అలాగే, ఉన్నత స్థాయి ప్రతినిధుల ద్వారా హిజ్బుల్లా నేతలతో కూడా చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్చల అనంతరం పూర్తి స్థాయి కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం, ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై దాడులు చేయదు, హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై ఎలాంటి దాడులకు పాల్పడదని ట్రంప్ తెలిపారు.
