Site icon NTV Telugu

Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు

Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో చర్చల కోసం స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాన్‌తో బుధవారం చర్చలు ప్రారంభం కాబోతున్నాయని.. ఇందుకోసం అధ్యక్షుడు ట్రంపే స్వయంగా రంగంలోకి దిగవచ్చని పేర్కొంది. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే ట్రంపే స్వయంగా లేదా వర్చువల్‌గా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది.

పాకిస్థాన్ వేదికగా జరిగే చర్చల్లో ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి పాల్గొన వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చల విషయంలో ఇరాన్‌లో కూడా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది చర్చలకు వెళ్లాలని అంటుంటే.. ఇంకొందరు వద్దని వాదిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. పలు కీలక అంశాలపై కూడా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా కూడా చర్చలకు వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం.

అయితే ట్రంప్ మాత్రం ప్రపంచ మార్కెట్లను చక్కదిద్దాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలను అరికట్టాలని చూస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్‌కు చెందిన అణు సంబంధిత కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. అయితే ఈ వార్తలను కొన్ని మీడియా సంస్థలు తక్కువ చేసి చూపించాయని ధ్వజమెత్తారు. వాటిని తిరిగి నిర్మించడం చాలా కష్టమైన పని.. కానీ ఫేక్ న్యూస్ మీడియా అమెరికా వైమానిక దళ సిబ్బందికి సరైన గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు.

గతేడాది జూన్ 12న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం జూన్ 22న అమెరికా వైమానిక దళం, నౌకాదళం కలిసి ఇరాన్‌లోని అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్, నతాంజ్ అణు కేంద్రం, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకుని బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించారు. ఈ దాడులు 12 రోజుల యుద్ధంలో కీలక ఘట్టంగా నిలిచాయి. జూన్ 24న కాల్పుల విరమణతో యుద్ధం ముగిసింది.

తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలందరినీ హతమార్చాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు రేపటితో ముగుస్తోంది. అయితే ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version