NTV Telugu Site icon

COVID 19: కరోనా సోకినవారిని పట్టేస్తున్న జాగిలాలు….!

Dogs

Dogs

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి టెస్ట్‌ చేసే.. వైరస్‌ సోకిందా? లేదా? అని నిర్ధారిస్తున్నారు.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా తేలుతుంది.. అయితే, ఇప్పుడు జాగిలాలను రంగంలోకి దింపారు… హత్య కేసులు, ఇతర కేసుల్లో నిందితుల గుర్తింపు కోసం జాగిలాలను ఉపయోగించడం చూశాం.. సెక్యూరిటీ చెక్స్‌లోనూ జాగిలాలను ఉపయోగిస్తుంటారు.. ఇప్పుడు కోవిడ్‌ సోకినవారిని గుర్తించేందుకు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు.. ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి పరిశోధకులు- నాలుగు జాగిలాలకు కరోనా వైరస్‌ను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. 420 మంది వాలంటీర్ల స్కిన్‌ స్వాబ్‌ నమూనాలను వాటి ముందు ఉంచగా… ఈ నాలుగు జాగిలాలు వారిలో 114 మంది కరోనా బాధితులను పట్టేశాయి.. మిగతా 306 మంది పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం రావడం విశేషంగా చెప్పుకోవాలి.

Read Also: TDP: ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..?

ఆ జాగిలాలకు ఏడు దఫాల శిక్షణ తర్వాత ఈ స్వాబ్‌ నమూనాలను అవి 92 శాతం కచ్చితత్వంతో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 28 మంది బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వారిని సైతం జాగిలాలు గుర్తించాయంటే.. అవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క కేసులో మాత్రం ఇవి తప్పుగా నెగెటివ్‌ అని గుర్తించాయని, రెండు నమూనాల వాసన సరిగా చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020 సెప్టెంబరు- 2021 ఏప్రిల్‌ మధ్య హెల్సింకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రయాణికులకు పీసీఆర్‌ పరీక్షలతో పాటు జాగిలాల ముందు ఆ నమూనాలను ఉంచగా… 98 శాతం కచ్చితత్వంతో వాటిని నెగెటివ్‌/పాజిటివ్‌గా గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. మొత్తంగా.. కోవిడ్‌ బాధితులను గుర్తించడంలోనూ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.