Tarique Rahman: బ్రిక్స్‌ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!

  • బ్రిక్స్‌ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం
  • రావాలనే ఆసక్తి ఉన్నా.. షేక్ హసీనా సమస్యతో దాటవేత!
  • డిసెంబర్‌లో పర్యటన ఉండే అవకాశం
Tarique Rahman

Tarique Rahman

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా శని, ఆదివారాల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సుకు బ్రిక్స్‌లో సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలువురు ఢిల్లీకి వస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ మాత్రం రావడం లేదు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఢిల్లీ పర్యటనపై తారిఖ్ రెహమాన్ సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

రావాలనే ఆసక్తి ఉన్నా.. సమస్య ఇదే!

దౌత్య వర్గం ప్రకారం.. తారిఖ్‌ రహమాన్ వీలైనంత త్వరగా భారత్‌ను సందర్శించాలని కోరుకుంటున్నారు. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత బంగ్లాదేశ్‌ ప్రజలకు చూపించగలిగే కచ్చితమైన ఫలితాలు లేదా విజయాలు ఏముంటాయనే అంశంపై ఆయన ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజకీయ కార్యకలాపాలు తారిఖ్‌ రహమాన్ ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఢాకా ఇప్పటికే పలుమార్లు భారత్‌ను కోరింది. విద్యార్థుల హత్యల్లో హసీనా ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమస్య పరిష్కారం కాకపోవడంతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయినా సమస్సుకు హాజరుకాకపోయినా భారత్‌ను దూరం చేసుకునే ప్రయత్నంగా చూడకూడదని దౌత్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌ బంగ్లాదేశ్‌కు ముఖ్యమైన పొరుగు దేశమని, 1971 విమోచన యుద్ధ సమయంలో భారత్‌ అందించిన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల పెరిగిన భారత్‌ వ్యతిరేక భావనకు అవామీ లీగ్‌ కారణమని ఆ వర్గం ఆరోపించింది. భారత్‌తో నమ్మకంతో కూడిన సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపింది.

హసీనా ప్రసంగంతో ఉద్రిక్తత

ఆగస్టు 5న న్యూఢిల్లీ నుంచి షేక్‌ హసీనా వర్చువల్‌గా మీడియా సమావేశంలో ప్రసంగించిన తర్వాత భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పనిచేస్తానని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసిందని, భారత్‌తో సంబంధాల మెరుగుదలకు జరుగుతున్న ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. హసీనాను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం “పరారీలో ఉన్న దోషిగా తేలిన జెనోసైడ్‌ నిందితురాలు”గా అభివర్ణించింది. అయితే ఆ మీడియా కార్యక్రమాన్ని నిర్వహించడంలో భారత్‌కు ఎలాంటి పాత్ర లేదని, బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై హసీనా చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగస్టు 7న స్పష్టం చేసింది.

బ్రిక్స్‌ సమావేశానికి తారిఖ్‌ రహమాన్ హాజరవుతారా? లేదా బంగ్లాదేశ్‌ తరఫున మరొక ప్రతినిధిని పంపుతారా? అనే విషయంపై ఢాకా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు ఖలీలుర్‌ రహ్మాన్‌ను ప్రశ్నించగా.. ప్రధాని ఢిల్లీకి వెళ్తారా లేదా అన్న దానిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ద్వైపాక్షిక పర్యటన?

బ్రిక్స్‌ సదస్సుకు హాజరు కాకపోయినా.. తారిఖ్‌ రహమాన్ నవంబర్‌ లేదా డిసెంబర్‌ ప్రారంభంలో ద్వైపాక్షిక పర్యటన కోసం ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో కీలక అంశంగా గంగా జలాల ఒప్పందం ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పునరుద్ధరణకు గడువు దగ్గరపడుతోంది. డిసెంబర్‌ చివరినాటికి ఒప్పందం పునరుద్ధరించకపోతే అది ముగిసే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్‌ ఎదుర్కొంటున్న ఇంధన కొరత కూడా భారత్‌–బంగ్లాదేశ్‌ చర్చల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. దేశంలో తీవ్ర ఇంధన సరఫరా కొరత ఉందని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్‌ నుంచి సహాయం లభిస్తే అది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే చర్యగా మారుతుందని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో తారిఖ్‌ రెహమాన్ భారత్‌ పర్యటన జరిగితే.. కేవలం భేటీలకే పరిమితం కాకుండా, రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తీసుకొచ్చే కచ్చితమైన ఫలితాల ఆధారంగా పర్యటనను రూపొందించాల్సి ఉంటుందని ఆ వర్గం తెలిపింది.

ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు

2026లో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది. జనవరి 1 నుంచి భారత్‌ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. గతంలో 2012, 2016, 2021లోనూ భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. 18వ బ్రిక్స్‌ సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. బ్రిక్స్‌ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నేతలతో పాటు ఇతర ఆహ్వానితులు కూడా ఇందులో పాల్గొననున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.