Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్

  • సెప్టెంబర్ 21 నుంచి న్యూయార్క్‌లో యూఎన్ సమావేశాలు
  • యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
  • భారత్ రెండు ఆహ్వానాలు అందించిన బ్రిక్స్‌కు దూరం
Tarique Rahman

Tarique Rahman

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనాలని భారతదేశం రెండు సార్లు ఆహ్వానాలు పంపించినా ఎలాంటి జవాబు రాలేదు. భారత్ ఆహ్వానాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించేందుకు న్యూయార్క్ వెళ్తున్నారు. సెప్టెంబర్ 21 నుంచి న్యూయార్క్‌లో జరిగే 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తారిఖ్ రెహమాన్ పాల్గొననున్నారు.

తారిఖ్ రెహమాన్‌ గత ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్ పర్యటించాలని కేంద్రం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కానీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బూచీగా చూపించి పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. అయితే తారిఖ్ రహమాన్ తొలి భారత్ పర్యటనను బహుపాక్షిక వేదికగా కాకుండా ప్రత్యేక ద్వైపాక్షిక పర్యటనగా నిర్వహించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ అన్నారు.

రెండు ఆహ్వానాలు

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్‌కు భారత్ నుంచి రెండు వేర్వేరు ఆహ్వానాలు అందాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒకటి ప్రత్యేక ద్వైపాక్షిక పర్యటన కోసం కాగా.. మరొకటి BIMSTEC చైర్ హోదాలో BRICS సదస్సుకు హాజరు కావడానికి ఇచ్చిన ఆహ్వానం. అయితే రహ్మాన్ భారత్ పర్యటనపై ఢాకా నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ మాత్రం BRICS ఆహ్వానం తారిఖ్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా కాకుండా BIMSTEC చైర్‌గా మాత్రమే వచ్చిందని పేర్కొంది. అందువల్ల ఢిల్లీ పర్యటనను BRICS వేదికతో ముడిపెట్టడం కంటే.. ముందుగా ప్రత్యేక ద్వైపాక్షిక పర్యటన జరగాలని ఢాకా కోరుతోంది.