దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీబస్ ట్యాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్లో ఎన్1 హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ప్రిన్స్ ఆల్బర్ట్, లీ-గామ్కా ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం కేప్టౌన్కు సుమారు 380 కిలోమీటర్ల తూర్పున ఉంది.
తర్వాత SUV కూడా
రెండు మినీబస్ ట్యాక్సీలు ఎన్1 హైవేపై ఎదురెదురుగా ఢీకొన్నాయని వెస్ట్రన్ కేప్ మొబిలిటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అదే ప్రాంతంలోకి ఓ SUV దూసుకొచ్చి ప్రమాదానికి గురైన వాహనాల శిథిలాలను ఢీకొట్టినట్లు తెలిపింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడికి చేరుకునేలోపే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఘటనాస్థలంలో అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం కారణంగా ఎన్1 హైవేలోని ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. సహాయక బృందాలు, అత్యవసర సేవల సిబ్బంది తమ పనులు పూర్తి చేసే వరకు రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దర్యాప్తు ప్రారంభించింది.
తరచూ ప్రమాదాలు
దక్షిణాఫ్రికాలో మినీబస్ ట్యాక్సీలు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇవి తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండు వేర్వేరు మినీబస్ ట్యాక్సీ ప్రమాదాల్లో కనీసం 25 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ప్రమాదంతో దక్షిణాఫ్రికాలో రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

