Khawaja Asif: పాకిస్థాన్లో అంతర్గతంగా ముదురుతున్న నీటి సంక్షోభం, భారత్తో ఉన్న సింధు నదీ జలాల వివాదంపై తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారతదేశంతో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడబోమని ఆయన నిస్సిగ్గుగా హెచ్చరించారు. పాకిస్థాన్కు చెందిన వార్తా సంస్థ ‘ARY న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. నీరు అనేది తమ దేశ జాతీయ భద్రతలో ఒక కీలక భాగమని పేర్కొన్నారు.
“మా జాతీయ భద్రతకు, ముఖ్యంగా నీటి సరఫరాకు ముప్పు వాటిల్లిందని మాకు అనిపించిన క్షణమే, మేము భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తాము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నీటి సరఫరాకు అంతరాయం కలిగించే దిశగా భారతదేశం ‘ఆందోళనకరమైన వేగంతో’ వెళ్తోందని మాకు కచ్చితమైన ఆధారాలు లభిస్తే.. మేము యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటాం” అని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని, చెనాబ్ నది ప్రవాహాన్ని తారుమారు చేస్తూ, కీలకమైన జలసంబంధ సమాచారాన్ని తమకు అందకుండా దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.
సింధు జలాల సెగకు కారణం ఇదే..
భారతదేశ జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇటీవల బయటకు వచ్చింది. అందులో 2028 జూన్ నాటికి సింధు నది జలాలు పాకిస్థాన్లోకి ప్రవహించకుండా పూర్తిగా నిలిపివేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాతే పాక్ రక్షణ మంత్రి ఈ విధంగా మాట్లాడారని చెబుతున్నారు. ఈ వివాదానికి కారణం.. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిన సంఘటన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ.. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం పూర్తిగా ఆపేంత వరకు 1960 నాటి ‘సింధు జలాల ఒప్పందాన్ని’ (Indus Waters Treaty) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Abeyance) ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదీ పరీవాహక ప్రాంతంలోని సుమారు 80 శాతం నీరు పాకిస్థాన్కే కేటాయించారు. ఈ నీళ్లు ఆ దేశంలోని 80 శాతం వ్యవసాయ భూమికి ప్రధాన ఆధారంగా ఉన్నాయి.
ఒకవైపు పాకిస్థాన్ భారత్ను బెదిరిస్తున్నా, మరోవైపు దేశంలో తీవ్రమైన నీటి కొరతతో విలవిలలాడుతోంది. ప్రస్తుతం పాక్ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది (ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్ ప్రాంతాల ప్రజలు) తాగడానికి, సాగుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. సింధ్ నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం.. అక్కడ నార్త్ వెస్ట్ కెనాల్ 64.1 శాతం, రైస్ కెనాల్ 38 శాతం, దాదు కెనాల్ ఏకంగా 82 శాతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. తమకు రావలసిన 44,000 క్యూసెక్కుల నీటి కేటాయింపుకు బదులుగా, ఎగువన ఉన్న పంజాబ్ ప్రాంతం 21 శాతం అదనంగా (53,394 క్యూసెక్కులు) నీటిని అక్రమంగా వాడుకుంటోందని సింధ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహాలు తగ్గిపోతుండటంతో పాకిస్థాన్లోని వివిధ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి వివాదాలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల దేశంలో రాబోయే రోజుల్లో “ఆర్థిక విధ్వంసం” తప్పదని అక్కడి స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. వారి దేశంలో ఉన్న అంతర్గత నీటి సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ రక్షణ మంత్రి భారత్పై ఇలాంటి యుద్ధ హెచ్చరికలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

