Ittehad-ul-Mujahideen: పాకిస్థాన్లో ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబన్ (TTP), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సంస్థలు రక్తపాతం సృష్టిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ అనే ఉగ్రవాద సంస్థ దేశాన్ని వణికిస్తోంది. ఆదివారం బన్నూ ప్రాంతంలో పాక్ సైన్యంపై ఈ ముఠా జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆర్మీ తన ఆధీనంలో ఉందని చెప్పుకునే ప్రాంతంలోనే ఈ స్థాయి దాడి జరగడం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఏడాది క్రితమే పుట్టుక.. లక్ష్యం ఒక్కటే
ఈ ఉగ్రవాద సంస్థ సరిగ్గా ఏడాది క్రితం, ఏప్రిల్ 11, 2025న స్థాపించబడింది. తెహ్రీక్-ఎ-తాలిబన్ తరహాలోనే పాకిస్థాన్లో కఠినమైన ఇస్లామిక్ పాలనను తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సంస్థలోని ఉగ్రవాదులందరూ ఎక్కువగా అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్నారు. బిబిసి మానిటరింగ్ నివేదిక ప్రకారం.. 2025లో ఖైబర్ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మూడు వేర్వేరు ఉగ్రవాద బృందాల కలయికతో ఈ కొత్త సంస్థ ఏర్పడింది. ఇస్లామిక్ క్రాంతి, లష్కరే-ఇ-ఇస్లాం, హాఫిజ్ గుల్ బహదూర్ గ్రూప్ (ఒకప్పుడు పాక్ ప్రభుత్వం దీనిని ‘గుడ్ తాలిబన్’ అని పిలిచేది).
నాయకుడు లేడు.. కానీ వ్యూహం పక్కా
పాక్ సైన్యం జరిపే దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ సంస్థ ఒక వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీనికి అధికారికంగా ఎలాంటి ‘సర్కార్’ లేదా ‘నాయకుడు’ లేడు. దీనివల్ల సైన్యం ఎవరిని టార్గెట్ చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతోంది. టెలిగ్రామ్ వేదికగా ఈ సంస్థ పష్టో, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో తన ప్రచారాన్ని సాగిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మహ్మూదుల్ హసన్ అనే వ్యక్తి ఈ సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
బన్నూ దాడి తర్వాత పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఉగ్రవాద సంస్థ వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందని, అఫ్గాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్తో జరిగిన ఒప్పందాల వల్ల TTP దాడులు కొంత తగ్గాయి. ఇదే సమయంలో BLA కూడా బలహీనపడటంతో, ‘ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్’ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం అంతర్జాతీయ భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతానికి బన్నూ దాడి ఈ ఏడాది పాక్ ఎదుర్కొన్న అతిపెద్ద ఉగ్రవాద దాడి కావడంతో, ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
