Site icon NTV Telugu

పాక్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌..! మళ్లీ కఠిన ఆంక్షలు..

Pakistan

Pakistan

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గనేలేదు.. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఏకంగా కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ స్టార్ట్‌ అయిపోయిందట.. పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతోంది.. డెల్టా వేరియంట్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో.. అప్రమైంది పాక్‌ ప్రభుత్వం… కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ది నేష‌న‌ల్ క‌మాండ్ అండ్ ఆప‌రేష‌న్ సెంట‌ర్ (ఎన్‌సీవోసీ) కొత్త మార్గద‌ర్శకాల‌ను కూడా తాజాగా విడుద‌ల చేసింది. పాజిటివ్‌ కేసులు అత్యంత వేగంగా ఒక‌రి నుంచి ఒక‌రికి సంక్రమిస్తున్నాయని.. డెల్టా వేరియంట్ కల్లోలం సృష్టిస్తోందని తెలిపారు పాక్‌ ప్రణాళికా శాఖ మంత్రి అస‌ద్ ఉమ‌ర్.

దేశవ్యాప్తంగా కొత్త కేసులు పెరగడంతో పాటు.. పాజిటివిటీ శాతం క్రమంగా పెరుగుతుందన్నారు అసద్ ఉమర్.. దీంతో.. కోవిడ్‌ కట్టడికి నిబంధ‌న‌ల‌ను కఠినత‌రం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. సిటీల్లో కేసుల సంఖ్య ఎక్కువ ఉండడం.. కొత్త కేసులు కూడా భారీ సంఖ్యలో వెలుగు చూస్తుండడంతో.. ప్రధాన‌ న‌గ‌రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాహోర్‌, రావ‌ల్పిండి, ఇస్లామాబాద్‌, ముజ‌ఫ‌రాబాద్‌, మీర్పూర్‌, ఫైస‌లాబాద్‌, ముల్తాన్‌, అబోట్టాబాద్‌, పెషావ‌ర్‌, క‌రాచీ, హైద‌రాబాద్‌, గిల్గిత్‌, స్కర్దు తదితర సిటీల్లో ఆంక్షలు అమలు ఉంటాయని పేర్కొంది పాక్‌ సర్కార్.. అన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటలలోపే అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయాల్సి ఉంటుంది.. ఇక, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో 50 శాతం ఉద్యోగులతో విధులు నిర్వహించాలని.. ప్రజార‌వాణా వాహ‌నాల్లో 50 శాతం మందికే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది పాకిస్థాన్‌ ప్రభుత్వం.

Exit mobile version