Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో(PoK)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై దమనకాండకు తెగబడుతోంది. ఉద్యమకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో తాజాగా 20 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఆక్రమిత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. పీఓకే ప్రజలు ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాదంపై మరోసారి ఒప్పుకుంటూ వ్యాఖ్యలు చేసింది. తాము పెంచి పోషించిన పామే ఇప్పుడు తమను కాటేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా ఒప్పుకున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి ముజాహిదీన్లుగా పంపిన వ్యక్తులే ఇప్పుడు తమకు పెద్ద సమస్యగా మారారని అన్నారు. “ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పోరాడుతున్న వారిలో చాలామంది గతంలో మనం ముజాహిదీన్లుగా శిక్షణ ఇచ్చి పంపినవారే. అప్పటి నుంచి వారు మనపై పగ పెంచుకున్నారు” అని అన్నారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని అన్నారు. వారికి రాజకీయ లక్ష్యాలు, ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి లేదని, సాధారణ ప్రజల్ని ఉపయోగించుకుని పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.

