Pakistan: క్వెట్టాలో భారీ పేలుడు.. పలువురికి గాయాలు

Pakistan

Pakistan

Huge blast in Pakistan’s Quetta: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో పోలీసులు, సైనికులు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల పెషావర్ లో మసీదులో పేలుడు ఘటన మరవక ముందే మరోసారి బాంబు పేలుడు జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని చెక్ పాయింట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

Read Also: CM KCR : దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదు

ఆదివారం ఉదయం ఎఫ్సీ ముస్సా చెక్ పాయింట్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్వెట్టా పోలీసు ప్రధాన కార్యాలయం, క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశ ద్వారం సమీపంలో, అత్యంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు సంభవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదు. గత సోమవారం పాకిస్తాన్ వాయువ్య నగరం అయిన పెషావర్ హైసెక్యూరిటీ ఏరియాలోని మసీదులో ప్రార్థన సమయంలో తాలిబాన్ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవడంతో కనీసం 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నారు.

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ దేశాన్ని ఓ వైపు ఆర్థిక సంక్షోభం భయపెడుతుంటే..మరోవైపు ఉగ్రవాద దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. పాకిస్తాన్ గిరిజన ప్రావిన్స్ అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బలూచిస్థాన్ లో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పాక్ ఆర్మీ, పోలీసులు, చైనా కార్మికులే టార్గెట్ గా దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ ను పాకిస్తాన్ నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తోంది.