Operation Hormuz: యూఎస్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా కీలక ఆపరేషన్ ప్రారంభించింది. జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకల్ని సురక్షితంగా రక్షణ కల్పించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “ప్రాజెక్ట్ ఫ్రీడమ్” అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొనసాగుతున్న సంఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనని అనేక దేశాలు, ఈ కీలకమైన షిప్పింగ్ కారిడార్లో చిక్కుకుపోయిన తమ నౌకలను విడిపించడానికి అమెరికా సహాయాన్ని కోరాయని తెలిపారు. ఆయన ఆ నౌకలను, వాటి సిబ్బందిని ఒక అస్థిరమైన పరిస్థితిలో చిక్కుకున్న “తటస్థ, అమాయక సాక్షులు”గా అభివర్ణించారు.
ఈ నౌకలు స్వేచ్చగా, సమర్థవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అమెరికా వాటిని నిషేధిత జలాల నుంచి బయటకు పంపిస్తుందని ట్రంప్ అన్నారు. ఈ ఆపరేషన్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇది ఒక మానవత ప్రయత్నమని ట్రంప్ చెప్పారు. ఓడల్లో ఉన్న సిబ్బందికి సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన ఆహారం, నిత్యావసర వస్తువుల కొరత నెలకొన్నట్లు చెప్పారు. ఈ ప్రయత్నం ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఇదే సమయంలో ఇరాన్తో సానుకూల చర్చలు జరుగుతున్నాయని, దౌత్య పురోగతికి ఆస్కారం ఉందని ట్రంప్ చెప్పారు. ఈ ఆపరేషన్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని ఇరాన్ను హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ యుద్ధంలో కీలకంగా మారింది. ఇరుకైన ఈ జల మార్గం ద్వారా 20 శాతం చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది.
