విమానం గాల్లో ఉండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఈ ఘటన నెదర్లాండ్స్కు చెందిన కేఎల్ఎం విమానంలో చోటుచేసుకుంది.
సెప్టెంబర్ 17న కేఎల్ఎం విమానం ఆమ్స్టర్డామ్ నుంచి కురాకావోకు వెళ్తోంది. అట్లాంటిక్ మహాసముద్రంపై విమానం ప్రయాణిస్తోంది. అప్పటికే 5.5 గంటల ప్రయాణం జరిగిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా పవర్ బ్యాంక్ పేలిపోయింది. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే బిజినెస్ క్లాస్ క్యాబిన్లో కొంత నష్టం వాటిల్లింది. విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ బోయింగ్ 777 విమానాన్ని తిరిగి ఆమ్స్టర్డామ్లోని షిపోల్ విమానాశ్రయం వైపు మళ్లించాడు. ఐదున్నర గంటల తర్వాత ఆమ్స్టర్డామ్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 11 గంటల తర్వాత ఎక్కడ నుంచి బయల్దేరారో.. తిరిగి అక్కడికే రావడంతో ప్రయాణికులు నిరాశ పడ్డారు.
మాజీ KLM సీఈవో పవర్ బ్యాంక్?
ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. మంటలు చెలరేగిన పవర్ బ్యాంక్ మాజీ KLM అధ్యక్షుడు, సీఈవో కమీల్ యూర్లింగ్స్కు చెందినదేనని పలువురు ప్రయాణికులు డచ్ మీడియాకు తెలిపారు. ఆయన పవర్ బ్యాంక్ను ఉపయోగిస్తున్న సమయంలోనే మంటలు చెలరేగినట్లు, ఈ ఘటనలో స్వల్ప గాయాలు కూడా అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రయాణికుల గోప్యతను కారణంగా చూపుతూ పవర్ బ్యాంక్ యజమాని యూర్లింగ్సేనని KLM అధికారికంగా ధృవీకరించలేదు.
పవర్ బ్యాంక్లపై KLM నిబంధనలు
ఈ ఘటన నేపథ్యంలో KLM విమానాల్లో పవర్ బ్యాంక్ల వినియోగంపై ఉన్న నిబంధనలు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రయాణికులు పవర్ బ్యాంక్లను వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. విమానంలో వాటిని ఉపయోగించడం లేదా ఛార్జింగ్ చేయడం KLM నిబంధనలకు విరుద్ధం. పవర్ బ్యాంక్లను హ్యాండ్ లగేజీలో మాత్రమే ఉంచాలి. అవి ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఓవర్హెడ్ కంపార్ట్మెంట్లో పవర్ బ్యాంక్లను పెట్టకూడదు.
ఎందుకు ప్రమాదకరం?
పవర్ బ్యాంక్లలో సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. బ్యాటరీ దెబ్బతిన్నా, లోపం ఉన్నా లేదా కొన్ని పరిస్థితుల్లో అధికంగా వేడెక్కినా ‘థర్మల్ రన్అవే’ అనే ప్రమాదకర ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాటరీలో ఈ ప్రక్రియ మొదలైతే ఒక్కసారిగా తీవ్రమైన వేడి, పొగ, మంటలు వెలువడవచ్చు. విమానం లోపల ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే దాన్ని అదుపు చేయడం సిబ్బందికి పెద్ద సవాలుగా మారుతుంది.
గతంలోనూ ఇదే తరహా ఘటన
KLM విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా అంతరాయం ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. 2025 ఆగస్టులో సావో పాలో నుంచి బయలుదేరిన మరో KLM విమానంలో ప్రయాణికుడి బ్యాగ్లోని పవర్ బ్యాంక్ నుంచి పొగ రావడంతో ఆ విమానాన్ని కూడా ఆమ్స్టర్డామ్కు తిరిగి మళ్లించారు. తాజా ఘటనలో ప్రభావితమైన 322 మంది ప్రయాణికులకు KLM వసతి సదుపాయం కల్పించింది. మరుసటి రోజు మరో విమానం ద్వారా వారిని కురాకావోకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. జేబులో పట్టేంత చిన్న పరికరం కూడా విమానంలో ఎంతటి ప్రమాదానికి కారణమవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. లిథియం బ్యాటరీలను విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించడమే కాకుండా.. వాటిని ప్రయాణ సమయంలో సురక్షితంగా నిర్వహించడం కూడా అత్యంత కీలకమని ఈ ఘటన స్పష్టం చేసింది.

