Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్‌ను వీడనున్న కింగ్ చార్లెస్!

  • 180 ఏళ్ల బ్రిటన్ రాజ సంప్రదాయానికి బ్రేక్..
  • రాయల్ ఫ్యామిలీ సంచలన నిర్ణయం
Buckingham Palace

Buckingham Palace

Buckingham Palace: బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లండన్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ‘బకింహామ్ ప్యాలెస్’ కు ఏకంగా రూ.4,600 కోట్లు (£369 మిలియన్లు) ఖర్చు చేసి మరమ్మతులు చేయిస్తున్నప్పటికీ.. అక్కడ నివసించడానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా నిరాకరించారు. ఇటీవల విడుదలైన రాయల్ అకౌంట్స్ ద్వారా ఈ షాకింగ్ విషయం వెలుగుచూసింది.

180 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్..

గత 1837 నుంచి (క్వీన్ విక్టోరియా కాలం నుంచి) బ్రిటన్ పాలకులకు బకింహామ్ ప్యాలెసే అధికారిక నివాసంగా ఉంటూ వస్తోంది. దాదాపు రెండు శతాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయానికి కింగ్ చార్లెస్ స్వస్తి పలికారు. ఈ ప్యాలెస్ ఇకపై కేవలం బ్రిటన్ రాచరికపు పరిపాలనా ప్రధాన కార్యాలయంగా మాత్రమే కొనసాగుతుందని రాయల్ అధికారులు స్పష్టం చేశారు. కింగ్ చార్లెస్ ప్రస్తుతం తాను నివసిస్తున్న ‘క్లారెన్స్ హౌస్’ లోనే తన అధికారిక నివాసాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కింగ్ చార్లెస్ 2003 నుంచి సెంట్ జేమ్స్ ప్యాలెస్ పక్కనే ఉన్న క్లారెన్స్ హౌస్‌లో ఉంటున్నారు. ఒకప్పుడు ఇది క్వీన్ మదర్ నివాసం. 2005లో వివాహం జరిగినప్పటి నుంచి క్వీన్ కెమిల్లాతో కలిసి ఆయన ఇక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు వారిద్దరి వయసు 70 ఏళ్లు పైబడటంతో, సిబ్బందిని, నివాసాన్ని అంత పెద్ద ప్యాలెస్‌కు మార్చే హడావుడి ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రజల కోసమే ఈ నిర్ణయం..

అయితే రాజు బకింహామ్ ప్యాలెస్‌లో ఉండకపోవడానికి గల అసలు కారణాన్ని రాయల్ అధికారులు వెల్లడించారు. సాధారణ ప్రజలు, పర్యాటకులు ఈ చారిత్రాత్మక కట్టడాన్ని మరింత ఎక్కువగా సందర్శించేందుకు వీలు కల్పించడానికే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. రాజు అక్కడే ఉంటే భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకుల సందర్శనపై అనేక ఆంక్షలు విధించాల్సి వస్తుంది. బకింహామ్ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదాలు, నీటి లీకేజీల వల్ల నష్టం జరగకుండా ఉండేందుకు ‘సొవరేన్ గ్రాంట్’ తాత్కాలికంగా పెంచి ఈ మరమ్మతులు చేపట్టారు. గత పదేళ్లుగా సాగుతున్న ఈ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి కానున్నాయి. ఇందులో భాగంగా పాతబడిపోయిన కేబుళ్లు, లెడ్ పైపులు, వైరింగ్, బాయిలర్లను మారుస్తున్నారు. వీటిలో చాలా వస్తువులను గత 60 ఏళ్లలో మార్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం!

లిబరల్ డెమోక్రాట్ పార్టీ మాజీ హోమ్ ఆఫీస్ మంత్రి నార్మన్ బేకర్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, “రాజు అక్కడ నివసించడం లేదు కాబట్టి, బకింహామ్ ప్యాలెస్‌ను ఏడాది పొడవునా పర్యాటకుల కోసం పూర్తిగా తెరిచి ఉంచాలి. టికెట్ల ద్వారా వచ్చే లక్షలాది రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలి. తద్వారా ప్యాలెస్ మరమ్మతులకు అయిన ఖర్చును రాబట్టుకోవచ్చు” అని సూచించారు. రాజు ప్యాలెస్‌లో ఉండకపోయినప్పటికీ.. స్టేట్ బ్యాంక్వెట్స్, గార్డెన్ పార్టీలు, వివిధ దేశాల ప్రధానులు, రాయబారులతో జరిగే అధికారిక సమావేశాలన్నీ ఎప్పటిలాగే బకింహామ్ ప్యాలెస్‌లోనే వైభవంగా జరుగుతాయని రాజభవన వర్గాలు తెలిపాయి.