Site icon NTV Telugu

Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్‌ కిరాతకం!

Kim Jong Un Killed Uncle Jang Song Thaek

Kim Jong Un Killed Uncle Jang Song Thaek

తన అధికారాన్ని కాపాడుకోవడానికి సొంత మామనే నిర్దాక్షిణ్యంగా తొలగించిన నాయకుడి కథ మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మావయ్యను చంపడం కోసం అతడిని కుక్కలకు ఏరగా పడేశాడనే గుసగుసలు నాడు ప్రపంచాన్ని వణికించాయి. ఆ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.. ఆ కుటుంబంలో రక్త బంధాలు కంటే అధికారమే పెద్దదని అప్పుడే స్పష్టంగా తెలిసివచ్చింది. ఇప్పుడు అదే ఉత్తర కొరియా రాజవంశంలో మరో సంచలన దశ మొదలైంది.

కిమ్ జోంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తెను వారసురాలిగా సిద్ధం చేస్తున్నాడనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. అధికార బదిలీ అనే మాట అక్కడ సాధారణ రాజకీయ ప్రక్రియ కాదు.. అది చరిత్రలో ఎప్పుడూ తుపాకీ శబ్దాల మధ్యే జరిగిందనే భయం ప్రపంచాన్ని మళ్లీ కమ్మేస్తోంది. ఇంతకీ గతంలో ఏం జరిగింది? కిమ్‌ తన మావయ్యను ఎందుకు చంపాడు?

అది 2013.. కిమ్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. దేశంలో అతనికి తోడునీడలా ఉన్న వ్యక్తి జాంగ్ సాంగ్ థేక్. కిమ్ తండ్రి జోంగ్ ఇల్ కాలంలోనే కీలక నేతగా ఎదిగిన ఆయనను అప్పటివరకు ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెప్పుకునేవారు.

అధికార మార్పిడి సమయంలో యువ కిమ్‌కు రాజకీయ అండగా నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. అలాంటి వ్యక్తిని 2013 డిసెంబర్‌లో ఒక్కసారిగా పార్టీ సమావేశం నుంచి సైనికులు లాక్కెళ్లిన దృశ్యాలు దేశ మీడియా ప్రసారం చేసింది. కొద్ది రోజుల్లోనే అతనిపై దేశద్రోహం, అధికారం కబళించే కుట్ర, అవినీతి, డ్రగ్స్ వినియోగం లాంటి ఆరోపణలు మోపింది. ఆ వెంటనే అతన్ని న్యాయస్థానం విచారించడమే కాకుండా మరణదండన కూడా అమలు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్ర వార్తా సంస్థ అతన్ని దేశానికి శాశ్వత ద్రోహిగా అభివర్ణించింది. అతన్ని నగ్నంగా ఉంచి కుక్కలకు ఆహారంగా వేశారన్న కథ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. అయితే ఆ కథను స్వతంత్రంగా ఎవరూ ధృవీకరించలేకపోయారు. కానీ అతన్ని కాల్చివేశారన్న విషయాన్ని మాత్రం అంతర్జాతీయ వర్గాలు విశ్వసించాయి. ఇక కిమ్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరాల్లోనే పలువురు ఉన్నతాధికారులను పదవి నుంచి తొలగించారు. 2011 నుంచి 2016 మధ్య వందల సంఖ్యలో అధికార మార్పులు, అరెస్టులు, శిక్షలు నమోదయ్యాయి. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అంతర్జాతీయ ఆంక్షలు మధ్య అతను కఠిన నాయకత్వాన్ని ప్రదర్శించాడు. కొందరు విశ్లేషకులు దీన్ని భయపెట్టే పాలనగా చెప్పారు.

ఇక ఇదే సమయంలో పరిస్థితి మరో మలుపు తిరుగుతోంది. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ సమాచారం ప్రకారం కిమ్ తన కుమార్తెను ముఖ్య కార్యక్రమాలకు తీసుకువస్తున్నాడు. ఆమె పేరు జూ-ఏ. ఇటు క్షిపణి పరీక్షల సందర్బంగా ఆమెను ప్రజలకు చూపించారట.

ఇక అధికార వర్గాల్లో ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది వారసత్వ రాజకీయాల సంకేతంగా పరిగణిస్తున్నారు. అయితే అదే సమయంలో కిమ్ సోదరి యో జోంగ్ కూడా కీలక నేతగా కొనసాగుతోంది. విదేశాంగ ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యల్లో ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కుమార్తెను అధికార వారసురాలిగా ప్రకటిస్తే కుటుంబంలో అంతర్గత శక్తి సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ఎప్పుడూ సాఫీగా జరగలేదనే చరిత్ర దృష్ట్యా ఈ పరిణామాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి.

నిజానికి ఉత్తర కొరియా ఒకే కుటుంబ పాలనలో ఉన్న రాష్ట్రం. 1948 నుంచి ఇప్పటివరకు కిమ్ వంశమే అధికారంలో ఉంది. కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఉన్ వరకు మూడు తరాలుగా అధికారం బదిలీ అవుతూ వచ్చింది. అయితే ప్రతీసారి ఏదో ఒక సంచలన ఘటన జరిగింది. అందుకే ఉత్తర కొరియాలో అధికార కుర్చీ కేవలం పాలనా స్థానమే కాదు.. అది రక్తంతో రాసుకున్న చరిత్రకు సాక్ష్యం. ఇప్పుడు ఆ చరిత్ర మరో అధ్యాయానికి చేరువలో ఉందన్న సంకేతాలు ప్రపంచాన్ని మళ్లీ కలవరపెడుతున్నాయి.
ALSO READ: ‘ఇన్‌స్టా రీల్‌ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!

Exit mobile version