Kangana Ranaut: కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా

  • కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా
  • ఇన్‌స్టా కీలక సూచనలు చేసిన బీజేపీ ఎంపీ
  • జూన్ 18న కేతన్‌ను చంపిన కాబోయే భార్య సియా
Kangana Ranaut

Kangana Ranaut

పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మరోసారి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో నిందితురాలు సియా తల్లిదండ్రులకు మద్దతు తెల్పిన కంగనా.. తాజాగా యువతకు కీలక సలహా ఇచ్చింది. యువత జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక సందేశాన్ని పంచుకున్నారు. జీవితానికి స్పష్టమైన లక్ష్యం లేకుండా ఉండే అభిరుచి, మోజు చివరకు స్వీయ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

‘‘వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్‌లు, బెంచింగ్, ఘోస్టింగ్, డబుల్, ట్రిపుల్ డిజిట్ బాడీ కౌంట్లు, డ్రగ్స్, క్లబ్బులు… ఇవన్నీ ఉన్నా చాలడం లేదు. జీవితంలో లక్ష్యం లేకుండా ఉండే మోజు.. ఇలాంటి స్వీయ విధ్వంసకరమైన మార్గాల్లో వ్యక్తమవుతుంది.’’ అని పేర్కొన్నారు. మోజు ఉండటం తప్పు కాదని.. కానీ అది కెరీర్, నైపుణ్యం లేదా జీవిత లక్ష్యంపై ఉండాలన్నారు. యువత తమ శక్తిని సృజనాత్మక దిశగా మళ్లించాలని.. విశాల దృక్పథంతో ఆలోచిస్తూ విలువలతో కూడిన జీవనశైలిని అనుసరించాలని సూచించారు. అలాంటి జీవితం గడిపితే జైలు, విసుగు, ప్రతికూల ఆలోచనలు, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ఒక పిల్లవాడి కుటుంబ నేపథ్యం చూసి అతని లేదా ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కష్టమైందని అన్నారు.

ఒక వ్యక్తి విలువలను నిర్ణయించేది కేవలం కుటుంబం కాదని.. అతనిపై లేదా ఆమెపై ఎవరి ప్రభావం ఉందో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో, సోషల్ మీడియా, కృత్రిమ మేధ (AI), నిజ జీవిత పరిచయాలు వంటి అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే నేటి కాలంలో చాలామంది ద్వంద్వ జీవితం గడుపుతూ బయటకు మంచి వ్యక్తుల్లా కనిపిస్తారని.. అందువల్ల ప్రతి ఘటనకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సరికాదని కంగనా అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సహ నిందితుడు చేతన్ చౌదరితో సియా గోయల్ రహస్యంగా వివాహం చేసుకుందనే వార్తలను ఆమె తరఫు న్యాయవాది ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ జూలై 16 వరకు న్యాయస్థాన రిమాండ్‌లో ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి మొబైల్ ఫోన్లలోని డేటాను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది.