Jaishankar-Pakistan PM: జైశంకర్‌కు పాక్ ప్రధాని షరీఫ్‌ షేక్‌హ్యాండ్.. పలకరింపులు

  • పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పర్యటన
  • బుధవారం ఇస్లామాబాద్‌లో ఎస్‌సీవో సదస్సు
  • జైశంకర్‌తో కరచాలనం చేసిన పాక్ ప్రధాని
Pakpm

Pakpm

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో సభ్యదేశాల అతిథుల కోసం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్‌, జైశంకర్‌లు ఒకరినొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతిఒక్కరికీ ఉద్యోగం రావాలి..

ఎస్‌సీవో సదస్సు బుధవారం జరగనుంది. భారత బృందానికి విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వం వహిస్తారు. మొత్తంగా ఆయన పాకిస్థాన్‌లో 24గంటల కంటే తక్కువ సమయమే ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సదస్సులో చైనా, రష్యా ప్రధానులు కూడా పాల్గొననున్నారు. కీలక సమావేశం నేపథ్యంలో ఇస్లామాబాద్‌ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఎస్‌సీవో సదస్సుకు పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు ఆహ్వానం అందింది. పాక్‌లో పర్యటిస్తున్నప్పటికీ ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని భారత్‌ ఇదివరకే స్పష్టం చేసింది. అటు పాకిస్థాన్‌ కూడా ద్వైపాక్షిక చర్చలపై ఇలాగే స్పందించింది. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్‌లో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అఫ్గాన్‌పై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పాక్‌కు వెళ్లారు.