ఇటలీలో భారీ ప్రమాదం జరిగింది. భారీ విలాసవంతమైన యాచ్ సముద్రంలో మునిగిపోయింది. కొత్త యజమానికి డెలివరీ చేసిన కేవలం నాలుగు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సుమారు 98 అడుగుల పొడవున్న ‘అంజియోలా II’ (Angiola II) యాచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న అనంతరం నీరు చేరడంతో చివరకు సముద్రంలో మునిగిపోయింది. యాచ్లో ఉన్న 14 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఇటలీలోని సార్డీనియా ద్వీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పోర్టో సెర్వో సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. యాచ్లో ఇంజిన్ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలు వ్యాపించిన తర్వాత యాచ్లోకి నీరు చేరడం ప్రారంభమైంది. క్రమంగా అది ఒకవైపునకు ఒరిగి సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో యాచ్ నెమ్మదిగా సముద్రంలోకి అదృశ్యమవుతున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రమాద సమయంలో యాచ్లో మొత్తం 14 మంది ఉన్నారు. వారందరినీ ఇటాలియన్ అధికారులు సురక్షితంగా రక్షించారు. వారిలో ఎక్కువ మందిని సమీపంలోని మరో నౌకలోకి తరలించినట్లు సమాచారం. యాచ్ యజమాని చివరి వరకు అక్కడే ఉండి, చివరిగా నౌక నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఇటాలియన్ వ్యాపారవేత్తగా భావిస్తున్నప్పటికీ.. అధికారికంగా ఆయన వివరాలను వెల్లడించలేదు.
అంజియోలా IIను ఇటలీకి చెందిన ప్రముఖ యాచ్ తయారీ సంస్థ Permare 2020లో నిర్మించింది. సుమారు 98 అడుగుల పొడవున్న ఈ యాచ్ విలువ దాదాపు 9.1 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం. ఈ యాచ్లో ఐదు క్యాబిన్లు ఉండగా.. గరిష్ఠంగా 10 మంది అతిథులకు వసతి కల్పించవచ్చు. మరో ఐదుగురు సిబ్బంది ఉండేందుకు కూడా సదుపాయాలు ఉన్నాయి. నాలుగు ఇంజిన్లతో నడిచే ఈ యాచ్ గరిష్ఠంగా 28 నాట్స్ (గంటకు 52 కిలోమీటర్లకు పైగా) వేగంతో ప్రయాణించగలదు.
యాచ్ మునిగిపోవడానికి గల కారణాలపై ఇటలీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంజిన్ ఎందుకు విఫలమైంది? దాని తర్వాత మంటలు ఎలా చెలరేగాయి? యాచ్లోకి నీరు ఎలా చేరింది? అనే అంశాలపై ఇటాలియన్ కోస్ట్ గార్డ్ అధికారులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సముద్రంలో మునిగిపోయిన యాచ్ను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 220 టన్నుల సామర్థ్యం ఉన్న పాంటూన్ బోట్ను ఘటనాస్థలానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

