పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య భీకరమైన పోరు కొనసాగుతోంది. ఇక మంగళవారం లెబనాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. నగరం మీదుగా 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భారీ శబ్ధాలు చేసుకుంటూ వెళ్లినట్లు సమాచారం. అతి సమీపంలో వెళ్లడంతో భీకరమైన శబ్ధాలకు ప్రజలు హడలెత్తిపోయారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు సమాచారం.
బీరుట్ నగరం మీదుగా అతితక్కువ ఎత్తులో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు. హెజ్బొల్లా అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా.. గ్రూపు మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ సంతాప ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బీరుట్లోని బదారో జిల్లాలోని ఒక కేఫ్లో ఉన్న ప్రజలు యుద్ధ విమానల శబ్దం దాటికి చెల్లాచెదురుగా పారిపోయారు. బీరుట్లో వినిపించిన అతిపెద్ద శబ్దం ఇదేనంటూ వాపోతున్నారు.