Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం

  • మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు
  • ఇరాన్ వీడియో కలకలం
  • భద్రతా కట్టుదిట్టం
Trumpwife

Trumpwife

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నుంచి మరోసారి సంచలన ప్రచారం వెలుగులోకి వచ్చింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘Where to Kill Melania’’ (మెలానియాను ఎక్కడ హత్య చేయాలి) అనే శీర్షికతో విడుదలైన ఈ వీడియోలో మెలానియా ప్రయాణాలు, షాపింగ్ ప్రాంతాలను చూపిస్తూ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోలో మెలానియా ట్రంప్ న్యూయార్క్ నగరంలో మోటార్‌కేడ్‌లో ప్రయాణిస్తున్న దృశ్యాలు, ఆమె తరచూ షాపింగ్ చేసే విలాసవంతమైన దుకాణాల చిత్రాలను చూపించారు. ఆ ప్రాంతాలు ‘‘ప్రపంచ స్వేచ్ఛా యోధులు చర్యలు చేపట్టేందుకు అనువైన ప్రదేశాలు’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మెలానియా కొనుగోలు చేసే దుస్తుల్లో నర్వ్ ఏజెంట్ (విష రసాయనం) ఉపయోగించి విషప్రయోగం చేయవచ్చని సూచిస్తూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

బారన్ ట్రంప్‌కు హెచ్చరిక

వీడియో చివరిలో ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌ను ఉద్దేశించి ‘‘ఇది కేవలం ఆరంభమే… బారన్ ట్రంప్.. మా కోసం వేచి ఉండు’’ అంటూ ప్రత్యక్ష హెచ్చరిక చేశారు. ఈ వీడియో అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. మెలానియా ట్రంప్, బారన్ ట్రంప్‌లకు అమెరికా సీక్రెట్ సర్వీస్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. వైట్ హౌస్, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్, న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌ల వద్ద కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

ఆన్‌లైన్ ప్రచారంతో పాటు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా అమెరికా వ్యతిరేక ప్రచారం కొనసాగుతోంది. జోంహౌరీ వీధిలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ గొంతును పలువురు చేతులు నులిమేస్తున్నట్లుగా చిత్రీకరించి ‘‘ప్రతీకారం తప్పదు’’ అనే సందేశాన్ని ప్రదర్శించారు. గత వారం టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మరికొన్ని హోర్డింగ్‌లలో ట్రంప్ కుటుంబ సభ్యులు మెలానియా, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిఫనీ, బారన్‌లను లక్ష్యంగా చేసుకుంటూ ‘‘రక్తానికి రక్తమే’’ అనే హెచ్చరికలు కూడా కనిపించాయి.

హార్ముజ్ జలసంధి వివాదం

జూలై 27న ఇరాన్ విదేశాంగ శాఖ అమెరికా ఒమన్‌తో కలిసి హార్ముజ్ జలసంధి నిర్వహణపై జరిగిన చర్చల్లో పాల్గొనలేదని ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత హార్ముజ్ జలసంధి ప్రాంతం ఈ ఘర్షణలో అత్యంత కీలక కేంద్రంగా మారింది. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ తనను ప్రధాన లక్ష్యంగా చేసుకుందని పలుమార్లు ఆరోపించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ అత్యున్నత నాయకుడు సహా పలువురు కీలక అధికారుల మరణం తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయని పేర్కొన్నారు. ఇక టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందనే సమాచారంతో కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానం బదులు పాత విమానంలో ప్రయాణించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా నేను వారి లక్ష్య జాబితాలోనే ఉన్నాను. ఒకవేళ నాపై హత్యాయత్నం విజయవంతమైతే.. ఇరాన్ ఎప్పుడూ చూడని స్థాయిలో ప్రతిస్పందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను.’’ అని వ్యాఖ్యానించారు.