Internet Crisis: అంతర్జాతీయంగా హోర్ముజ్ జలసంధి ఇప్పుడు మరోసారి హైలెట్గా మారింది. ఇప్పటి వరకు నౌకల రాకపోకలపై పన్నులు విధించిన ఇరాన్, ఇప్పుడు ప్రపంచ దేశాల డేటాపై కన్నేసిందని సమాచారం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు అనుబంధంగా ఉన్న ‘తస్నిమ్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి కింద ఉన్న ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లపై ఇరాన్ భారీగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
10 ట్రిలియన్ డాలర్ల లావాదేవీలు
నిజానికి చాలామంది ఇంటర్నెట్ అనేది ఉపగ్రహాల ద్వారా నడుస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రపంచంలోని 95% నుంచి 97% డేటా సముద్రపు అడుగున ఉండే ఫైబర్-ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే ప్రసారం అవుతుంది. హోర్ముజ్ జలసంధి గుండా సుమారు 20కి పైగా ప్రధాన కేబుళ్లు వెళుతున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 10 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 లక్షల కోట్లు) ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో ఈ ప్రాంతం నుంచి దాదాపు 17% నుంచి 30% వెళ్తుంది. ఇప్పుడు ఈ కేబుళ్లపై పన్ను వేయడం ద్వారా ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాలని ఇరాన్ భావిస్తోందని సమాచారం.
భారతదేశానికి ప్రమాదం ఎందుకంటే..
ఈ పరిణామం భారతదేశానికి అత్యంత ఆందోళనకరం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి ఐరోపాకు వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్లో 60 శాతం ముంబై – రెడ్ సీ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ పన్నులు విధించిన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ కేబుళ్లకు నష్టం వాటిల్లిన భారత్లో డిజిటల్ సేవలు కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇంటర్నెట్ కేబుల్లకు ఏదైనా జరిగితే బ్యాంకింగ్, యూపీఐ (UPI) చెల్లింపులు, క్లౌడ్ సేవలు, ఆన్లైన్ ట్రేడింగ్, ఐటీ కంపెనీల కార్యకలాపాలు తీవ్రంగా నష్టపోతాయి. భారత్ తన మిగతా 40 శాతం డేటాను చెన్నై నుంచి సింగపూర్, పసిఫిక్ మహాసముద్రం మార్గం ద్వారా పొందుతోంది.
కీలకమైన 5 కేబుల్ వ్యవస్థలు
భారతదేశ పశ్చిమ దేశాల కనెక్టివిటీకి ఈ ఐదు వ్యవస్థలు వెన్నెముకగా ఉన్నాయి..
AAE-1: ఆసియా-ఆఫ్రికా-యూరప్ 1
FALCON: ఫాల్కన్ నెట్వర్క్
TATA TGN-Gulf: టాటా గల్ఫ్ కేబుల్
SEA-ME-WE 4: ఆగ్నేయాసియా-మధ్యప్రాచ్యం-పశ్చిమ ఐరోపా 4
IMEWE: ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరోప్
రంగంలోకి దిగిన భారత టెలికాం దిగ్గజాలు
పరిస్థితి తీవ్రతను గమనించిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. హోర్ముజ్ – ఎర్ర సముద్రం ప్రాంతంలో కేబుళ్ల భద్రతపై ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరపాలని కోరాయి. ఒకవేళ ఇరాన్ తన పన్ను నిర్ణయాన్ని అమలు చేస్తే, భారత్లో ఇంటర్నెట్ ప్యాక్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది జరిగిన దాడుల కారణంగా ఇప్పటికే ఐరోపాకు వెళ్లే డేటాలో 25% ప్రభావితమైనట్లు టాక్. ప్రస్తుత ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ప్రపంచం మరో డిజిటల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
