Site icon NTV Telugu

Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

Hormuz Amid Crisis

Hormuz Amid Crisis

Hormuz Amid Crisis: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్‌ జలసంధిపై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ఇరాన్ భారీ రుసుములు వసూలు చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, ఒక చమురు ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటడానికి సుమారు 2 మిలియన్ డాలర్లు (దాదాపు ₹18 కోట్లకు పైగా) చెల్లించాల్సి వస్తోంది. ఇది ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది.

సంక్షోభానికి కారణాలు:
ఇరాజ్‌, ఇజ్రాయెల్‌ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిస్థితికి దారితీశాయి. యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటం వల్ల, ఈ మార్గంలో ఏర్పడిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

భారీ రుసుముల వసూలు:
లండన్‌కు చెందిన “ఇరాన్ ఇంటర్నేషనల్” నివేదిక ప్రకారం, ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్దీ ఈ రుసుముల వసూలును సమర్థించారు. “యుద్ధానికి మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే ఈ రుసుములు అవసరం” అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అంతర్జాతీయ ప్రభావం:
చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.. పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. షిప్పింగ్ కంపెనీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది.. పాకిస్థాన్, శ్రీలంక, యూకే వంటి దేశాలు ఇప్పటికే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. అయితే ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరవాలని కోరుతూ, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ నాయకత్వం కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులు జరిగితే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది.

Exit mobile version