Elon Musk: చైనా రాజధాని బీజింగ్లో జరిగిన ఇండో – పసిఫిక్ టెక్ సదస్సులో ఒక ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (EV) రంగంలో దిగ్గజాలైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్, షియోమీ సీఈఓ లీ జున్ ఒకే ఫ్రేమ్లో కనిపించడమే కాకుండా, సెల్ఫీ దిగడం ఇప్పుడు గ్లోబల్ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమెరికా ప్రతినిధి బృందంతో కలిసి చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ కోసం బీజింగ్లో ఒక అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో షియోమీ వ్యవస్థాపకుడు లీ జున్ స్వయంగా మస్క్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి చిరునవ్వుతో సెల్ఫీ దిగారు. ఈ ఫోటో నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ను సాధించింది.
ఆ విందులో ఎలాన్ మస్క్ ఒక స్టార్ సెలబ్రిటీలా మారిపోయారు. అక్కడికి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రతినిధులు ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. మస్క్ కూడా తనదైన శైలిలో 360-డిగ్రీల సెల్ఫీలు తీసుకుంటూ అందరినీ ఉత్సాహపరిచారు. చైనాలో లీ జున్ను ‘చైనా మస్క్’ అని పిలుస్తుంటారు. గతంలో టెస్లా మోడల్ 3 ఉత్పత్తి సంక్షోభంలో ఉన్నప్పుడు మస్క్ ఫ్యాక్టరీ ఫ్లోర్పైనే నిద్రించేవారు. సరిగ్గా అలాగే, షియోమీ తన లక్షవ ఎలక్ట్రిక్ కారును పూర్తి చేసిన సందర్భంలో లీ జున్ కూడా ఫ్యాక్టరీలో నిద్రిస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఇది మస్క్ స్టైల్ను కాపీ కొట్టడమే అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
పోటీదారుల మధ్య స్నేహం..
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో టెస్లాకు షియోమీ గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా షియోమీ విడుదల చేసిన SU7 ఎలక్ట్రిక్ కారు చైనాలో టెస్లా మోడల్ 3కి ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి వ్యాపార పోటీ ఉన్నప్పటికీ, ఇద్దరు అగ్రనేతలు ఎంతో సరదాగా గడపడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “త్వరలోనే టెస్లా ఆప్టిమస్ రోబోట్, షియోమీ రోబోట్లు కూడా ఇలాగే సెల్ఫీలు దిగుతాయేమో” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా – చైనా మధ్య టెక్నాలజీ, ఏఐ (AI), సప్లై చైన్ అంశాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో మస్క్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన ఈ ఇద్దరు నేతల కలయిక, భవిష్యత్తులో ఈవీ (EV) రంగంలో మరిన్ని సంచలనాలకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
