Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత స్టాక్ ట్రేడింగ్ వ్యవహారంలో మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో మిలియన్ల డాలర్ల విలువైన షేర్ల లావాదేవీల వివరాలను సకాలంలో వెల్లడించనందుకు ఆయనకు జరిమానా పడింది. యూఎస్ ప్రభుత్వ ఎథిక్స్ కార్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూల్స్ ఉల్లంఘించిన ట్రంప్..
అమెరికా ప్రభుత్వ నైతిక నియమాల ప్రకారం.. అధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే, $1,000 కంటే ఎక్కువ విలువైన స్టాక్ లావాదేవీలు (కొనుగోళ్లు లేదా అమ్మకాలు) జరిపితే, ఆ వివరాలను 45 రోజులలోపు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ ఈ రూల్‌ను పాటించడంలో విఫలమవడంతో ఆయనకు $200 జరిమానా విధించారు. ఈ ఏడాదిలో ట్రంప్ ఇలాంటి జరిమానాను ఎదుర్కోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

మిలియన్ డాలర్ల ట్రేడింగ్..
ట్రంప్ ఆర్థిక నివేదికల ప్రకారం.. ఆయన ఫిబ్రవరి నెలలో మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon) కంపెనీలకు చెందిన దాదాపు $5 మిలియన్ల నుంచి $25 మిలియన్ల విలువైన షేర్లను విక్రయించారు. తిరిగి మార్చి నెలలో అదే కంపెనీల్లో మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ట్రేడింగ్ టైమింగ్‌పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అమెరికా రక్షణ శాఖ (Pentagon) తమ రహస్య కంప్యూటర్ నెట్‌వర్క్‌ల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థల సాంకేతికతను ఉపయోగించుకునేందుకు భారీ ఒప్పందాలను ప్రకటించడానికి కొద్ది నెలల ముందే ఈ ట్రేడింగ్ జరగడం గమనార్హం. ఫిబ్రవరి 10న ట్రంప్ ఖాతా ద్వారా ‘ఎన్విడియా’ షేర్లను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా, ఆ తర్వాత కొద్దిరోజులకే మెటా ప్లాట్‌ఫామ్స్‌తో ఎన్విడియా భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. దీంతో ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా 2.5 శాతం పైగా లాభపడ్డాయి.

అమెరికాలో వాటర్‌గేట్ కుంభకోణం తర్వాత ప్రయోజనాల సంఘర్షణ రాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు తెచ్చారు. జిమ్మీ కార్టర్ నుంచి చాలా మంది అధ్యక్షులు తమ పదవీకాలంలో వ్యక్తిగత స్టాక్ పోర్ట్‌ఫోలియోలను అమ్ముకున్నారు లేదా వాటిని ‘బ్లైండ్ ట్రస్ట్’ పరిధిలో ఉంచారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో (2017) ఈ నిబంధనలు పాటించినప్పటికీ.. రెండో పదవీకాలంలో మాత్రం తన షేర్లను అలానే ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తులను ఆయన పిల్లలు నిర్వహిస్తున్న ఒక ట్రస్ట్ చూసుకుంటోంది. అయితే ఇది పాత పద్ధతి లాంటి ‘బ్లైండ్ ట్రస్ట్’ కాదు. దీనివల్ల ట్రంప్‌కు తన పెట్టుబడులు, లావాదేవీల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వివాదంపై వైట్ హౌస్ స్పందిస్తూ.. దీనిని ట్రంప్ ఆర్గనైజేషన్‌కు బదిలీ చేసింది. ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కింబర్లీ బెంజా మాట్లాడుతూ.. అధ్యక్షుడి పెట్టుబడులన్నీ థర్డ్ పార్టీ ఆర్థిక సంస్థలే స్వతంత్రంగా నిర్వహిస్తాయని, ఈ పెట్టుబడి నిర్ణయాలలో ట్రంప్‌కు కానీ, ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రమేయం లేదా ముందస్తు సమాచారం ఉండదని స్పష్టం చేశారు. ట్రంప్ తన ఆర్థిక విధానాల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్, నాస్‌డాక్ రికార్డు స్థాయిలకు చేరుకున్నాయని నిరంతరం ప్రశంసించుకుంటున్న తరుణంలోనే ఈ వివాదం రావడం గమనార్హం. అమెరికాలో దాదాపు 81 శాతం మంది ఓటర్లు ప్రజాప్రతినిధులు స్టాక్ ట్రేడింగ్ చేయడాన్ని నిషేధించాలని కోరుకుంటున్నప్పటికీ, దీనిపై చట్టం తీసుకురావడంలో అక్కడి కాంగ్రెస్ ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంది.