Colombia Earthquake: కొలంబియాలో సోమవారం సంభవించిన 7.4 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 111 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పలుచోట్ల భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం 12:34 UTCకి, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు సంభవించింది. కొలంబియాలోని చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పాల్మార్కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సుమారు 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం ప్రభావం పలు నగరాలపై తీవ్రంగా పడింది. పెరీరాలో 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. మనిజాలెస్లో ఇద్దరు మృతి చెందినట్లు మేయర్ వెల్లడించారు. ఇక కాలి నగరంలో కనీసం 20 భవనాలు కూలిపోయినట్లు మేయర్ అలెజాండ్రో ఎడర్ తెలిపారు. కొన్ని భవనాల్లో ప్రజలు చిక్కుకుపోవడంతో సహాయక, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భవనాలకు నష్టం జరిగిందా, పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయా అనే విషయాన్ని పరిశీలించాలని, భవనం సురక్షితంగా లేదని అనిపిస్తే వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భూకంపం తర్వాత సంభవించే ప్రకంపనలపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
చోకో గవర్నర్ నుబియా కరోలినా కార్డోబా-కురి మాట్లాడుతూ.. భూకంపం కారణంగా క్విబ్డోలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని, కొందరు గాయపడినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
విమాన సర్వీసులకు అంతరాయం
భూకంపం కారణంగా కొలంబియాలోని పలు విమానాశ్రయాల్లో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు, విమానాల భద్రతను నిర్ధారించే వరకు కొన్ని సర్వీసులను నిలిపివేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ విభాగం స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది. రాజధాని బొగోటాలో మాత్రం ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదని నగర మేయర్ కార్లోస్ గలాన్ తెలిపారు. అయితే భూకంప ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
వెనిజులాలోనూ ప్రకంపనలు
కొలంబియాలో సంభవించిన భూకంప ప్రకంపనలు పొరుగున ఉన్న వెనిజులాలోనూ నమోదయ్యాయి. టాచిరా, బార్కిసిమెటో ప్రాంతాల్లో ప్రజలు ప్రకంపనలను అనుభూతి చెందినట్లు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ స్పష్టం చేసింది. అనేక టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు, ఫాల్ట్ జోన్లకు సమీపంలో ఉన్న కొలంబియా భూకంపాలకు గురయ్యే దేశాల్లో ఒకటి. కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ గణాంకాల ప్రకారం, దేశంలో గతంలో 100కు పైగా విధ్వంసకర భూకంపాలు నమోదయ్యాయి. తాజా భూకంపం నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి..

