ఇటలీలో విలాసవంతమైన నౌక మునక ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒకరి మృతదేహం అప్పుడే లభ్యమైంది. ఇక ఈ ప్రమాదం నుంచి లించ్ భార్యతో పాటు మరో 14 మంది బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా నౌకలో మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్తో పాటు 18 ఏళ్ల కుమార్తె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1996లో మైక్ లించ్( 59) సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. మూడు నెలల కిందటే అమెరికాలో ఓ మోసం కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. సిసిలీలో తీవ్ర తుపాను కారణంగా ఈ విలాసవంతమైన నౌక మునిగిపోయింది. సిసిలియన్ పోర్టు నుంచి ఆగస్టు 14న ఈ సూపర్యాచ్ బయలుదేరింది. ఆదివారం ఇందులో 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు సమాచారం. మైక్ లించ్, కుమార్తె మృతదేహం వెలికితీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, కుటుంబ సభ్యులంతా దు:ఖ సముద్రంలో మునిగిపోయారు