ప్రముఖ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ చైర్మన్ జో సాయ్, ఆయన భార్య క్లారా వూ సాయ్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దాదాపు 30 ఏళ్ల వివాహ బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం అలీబాబాతో పాటు తమ క్రీడా వ్యాపార సంస్థలు, పెట్టుబడులు, నాయకత్వ బాధ్యతలపై ఎలాంటి ప్రభావం చూపదని దంపతులు స్పష్టం చేసినట్లు తెలిపింది.
ఈ నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నదేనని జో సాయ్, క్లారా వూ సాయ్ పేర్కొన్నారు. ఒకరిపై మరొకరికి ఇప్పటికీ ఎంతో గౌరవం ఉందని తెలిపారు. విడాకులు తీసుకుంటున్నప్పటికీ.. అలీబాబా, క్రీడా రంగంలోని తమ పెట్టుబడులు, వ్యాపార ప్రయోజనాలు లేదా సంస్థల్లోని నాయకత్వ బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు.
నివేదిక ప్రకారం.. జో సాయ్ అలీబాబా చైర్మన్గా కొనసాగనున్నారు. అలాగే సంస్థలో తమకు ఉన్న వాటాలను విక్రయించే ఉద్దేశం లేదని దంపతులు స్పష్టం చేశారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జో, క్లారా సాయ్ దంపతులకు అలీబాబాలో కలిపి 1.4 శాతం వాటా ఉంది. జో అండ్ క్లారా సాయ్ ఫౌండేషన్ ద్వారా మరో 0.5 శాతం వాటాపై నియంత్రణ కలిగి ఉన్నారు. క్రీడా రంగంలో కూడా ఈ దంపతులకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) జట్టు బ్రూక్లిన్ నెట్స్, మహిళల నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (డబ్ల్యూఎన్బీఏ) జట్టు న్యూయార్క్ లిబర్టీకి మాతృసంస్థగా ఉన్న బీఎస్ఈ గ్లోబల్లో వీరికి 85 శాతం వాటా ఉంది.
విడాకుల తర్వాత కూడా బీఎస్ఈ గ్లోబల్ చైర్మన్గా జో సాయ్ కొనసాగుతారని నివేదిక పేర్కొంది. క్లారా వూ సాయ్ సంస్థ వైస్ చైర్గా తన బాధ్యతలను కొనసాగించనున్నారు. న్యూయార్క్ లిబర్టీ జట్టుకు గవర్నర్లుగా కూడా వీరిద్దరూ కొనసాగుతారని తెలిపింది. భవిష్యత్తులో తమ పిల్లలను కూడా ఈ వ్యాపారాల్లో భాగస్వాములను చేయాలని దంపతులు యోచిస్తున్నట్లు సమాచారం. విడాకుల నిర్ణయం బీఎస్ఈ గ్లోబల్, బ్రూక్లిన్ నెట్స్, న్యూయార్క్ లిబర్టీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని జో, క్లారా సాయ్ స్పష్టం చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఈ అంశంపై కార్యాలయ సమయం ముగిసిన తర్వాత బ్లూమ్బర్గ్ చేసిన వ్యాఖ్యల అభ్యర్థనకు అలీబాబా వెంటనే స్పందించలేదని తెలుస్తోంది.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 62 ఏళ్ల జో సాయ్ అంచనా నికర సంపద 9.7 బిలియన్ డాలర్లు. ఈ అంచనాలో క్లారా వూ సాయ్కు చెందిన అలీబాబా, బీఎస్ఈ గ్లోబల్ వాటాల విలువ కూడా కలిపి ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
జో సాయ్ 1999లో జాక్ మాతో కలిసి అలీబాబాను స్థాపించారు. 2018లో ఈ దంపతులు బ్రూక్లిన్ నెట్స్లో 49 శాతం వాటాతో పాటు బార్క్లేస్ సెంటర్ నిర్వహణ హక్కులను కొనుగోలు చేశారు. అనంతరం 2019లో జట్టులో మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసి పూర్తి యాజమాన్యాన్ని సొంతం చేసుకున్నారు. 2024లో కోచ్ కుటుంబానికి చెందిన సభ్యులు బీఎస్ఈ గ్లోబల్లో 15 శాతం వాటాను కొనుగోలు చేశారు.
దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి ముగింపు పలికినప్పటికీ.. అలీబాబా, బీఎస్ఈ గ్లోబల్, బ్రూక్లిన్ నెట్స్, న్యూయార్క్ లిబర్టీ సంస్థల్లో తమ వాటాలు, బాధ్యతలు యథాతథంగా కొనసాగుతాయని జో సాయ్, క్లారా వూ సాయ్ స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

