దక్షిణ ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) ప్రకారం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతానికి సమీపంలో కేంద్రీకృతమైంది. భూకంపం అనంతరం ఫిలిప్పీన్స్ అధికారులు తీరప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సునామీ వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ఇండోనేషియా, మలేషియా సహా సమీప దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఫిలిప్పీన్స్ ప్రపంచంలో అత్యంత భూకంప ప్రభావిత దేశాలలో ఒకటి. ఇది పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.

