Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ల అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లును అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెరవెనుక పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డీలిమిటేషన్.. సీట్ల పెంపు లాంటి కీలక అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఓ సరికొత్త ముసాయిదాను రెడీ చేసింది. లోక్సభ… అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త బిల్లు స్వరూపం ఎలా ఉండబోతోంది? ఎస్సీ.. ఎస్టీ స్థానాల పెంపు ఎలా ఉండనుంది? పార్లమెంట్లో ప్రభుత్వ వ్యూహం ఏంటి?
చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత విపక్షాల బలం తగ్గడంతో మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మరింత పకడ్బందీగా 133వ రాజ్యాంగ సవరణను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా సీట్ల పునర్విభజన సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలకు చెక్ పెట్టేలా ఈ కొత్త ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాల పెంపు వల్ల జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 1971 జనాభా లెక్కల ఆధారంగానే కొనసాగించాలని కేంద్రం గట్టిగా భావిస్తోంది. అదే సమయంలో ఒక రాష్ట్రం పరిధిలో నియోజకవర్గాల సరిహద్దుల మార్పునకు మాత్రం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ కొత్త ముసాయిదాలో అత్యంత కీలకమైన అంశం చట్టసభల స్థానాల పెంపు. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచబోతున్నారు. వీలైనంత వరకు అన్ని చోట్లా ఏకంగా 50 శాతం మేర సీట్లను పెంచాలని కేంద్రం భావిస్తోంది.. సాధ్యమైనంత వరకు 50 శాతం పెంపు విధానాన్ని అమలు చేసి.. మహిళలకు తగినన్ని సీట్లు కేటాయించాలని చూస్తున్నారు. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 55, 81, 82తో పాటు 170, 330లకు మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న డీలిమిటేషన్ బిల్లులో కూడా తగిన సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఈ కొత్త సూత్రాల ఆధారంగానే తన పనిని కొనసాగించాల్సి ఉంటుంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా సభలో మొత్తం సభ్యుల సంఖ్య పెరగాలి. అప్పుడే సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సీట్ల పెంపు ప్రక్రియతో కేవలం మహిళలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా భారీగా రాజకీయ లబ్ధి చేకూరనుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం చూస్తే.. లోక్సభలో ఎస్సీ స్థానాలు ప్రస్తుతమున్న 84 నుంచి ఒకేసారి 136కు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఎస్టీల స్థానాలు కూడా 47 నుంచి 70కి పెరగనున్నాయి. ఈ మార్పు చేయడం ద్వారా లోక్సభలో షెడ్యూల్డ్ కులాలకు దక్కాల్సిన పూర్తి 16 శాతం కోటా వారికి అందుతుంది. నిబంధనల ప్రకారం వారికి 16 శాతం రిజర్వేషన్లు దక్కాల్సి ఉన్నా… ప్రస్తుతం ఆ ప్రాతినిధ్యం కేవలం 15.46 శాతంగా మాత్రమే ఉంది. తాజా చట్టంతో ఈ లోటు భర్తీ కానుంది.
పెరిగిన ఈ కొత్త స్థానాల్లో మహిళా రిజర్వేషన్లను వర్టికల్ విధానంలో పక్కాగా అమలు చేస్తారు. అంటే పెరిగిన ఎస్సీ.. ఎస్టీ స్థానాల్లో కూడా మూడో వంతు సీట్లను ఆయా వర్గాలకు చెందిన మహిళలకే కేటాయిస్తారు. ప్రతిపాదిత 136 ఎస్సీ స్థానాల్లో… అలాగే 70 ఎస్టీ స్థానాల్లో కచ్చితంగా మూడో వంతు సీట్లు ఆయా సామాజిక వర్గాల మహిళలకు మాత్రమే రిజర్వ్ అవుతాయి. ఈ మొత్తం రాజకీయ ప్రక్రియను 2029 సాధారణ ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. డీలిమిటేషన్ విషయంలో పలు రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేలా ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
అయితే భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఈ భారీ నిర్ణయం అమలు చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాదు. దీనికోసం చట్టసభల్లో స్పష్టమైన సంఖ్యాబలం అత్యవసరం. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముసాయిదాను సిద్ధం చేసినా… పార్లమెంట్లో తగిన మద్దతు దక్కుతుందన్న నమ్మకం కలిగితేనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ చట్టం ఆమోదం పొందాలంటే లోక్సభ.. రాజ్యసభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ సాధించాలి. అంతటితో ఈ ప్రక్రియ పూర్తి కాదు. దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు ఈ బిల్లును ఆమోదించి తీరాల్సి ఉంటుంది. సంఖ్యాబలంపై పూర్తి ధీమా వచ్చాకే ఎన్డీయే సర్కార్ ఈ మహిళా బిల్లును అధికారికంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

