పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహా శక్తి భూగోళాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. అదే సూపర్ ఎల్ నినో. దీని ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర రూపం దాలుస్తుంటే.. మరోవైపు రాబోయే సంవత్సరాల్లో ఊహించని రీతిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి అంటే 2027లో వాతావరణం ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో చెబితే మీరు షాక్ అవుతారు.
వాతావరణం క్రమంగా సీజనల్ లక్షణాలను కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. వర్షాకాలంలో ఎండలు మండిపోవడం… ఎండాకాలంలో భారీ వర్షాలు కురియడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా జరుగుతోంది. 1901 నుంచి చూస్తే.. ఈ ఏడాది జూన్ లో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. చరిత్రలోనే ఇది ఐదో అత్యల్ప జూన్ గా నిలిచింది. అయితే జూలై మొదలవగానే పరిస్థితి ఒక్కసారిగా మారింది. గుజరాత్లోని వల్సాద్ ప్రాంతంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,064 మిల్లీమీటర్ల కుండపోత వర్షం కురిసి రికార్డు సృష్టించింది. అలాగే మహాబలేశ్వర్, లోనావాలా పరిసరాల్లో రెండు రోజుల్లోనే వెయ్యి మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో జూలై చివరి నాటికి వర్షపాతం లోటు 15 శాతానికి తగ్గింది. ఇలా ఒకేసారి అతి భారీ వర్షాలు పడటం వల్ల ముంపు ముప్పు పెరుగుతోంది.
భూమి ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తున్నాయి. దీనివల్ల సాధారణంగా కురిసే చినుకుల స్థానంలో మేఘాలు ఒకేసారి కుండపోతగా మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రత ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగినప్పుడు వాతావరణం 7 శాతం అదనంగా నీటి ఆవిరిని పట్టి ఉంచగలదు. వాతావరణంలోకి చేరిన ఈ తేమ ఒకేసారి కుండపోతగా కిందకు దిగుతోంది. అందుకే కొన్నిరోజులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ వెంటనే కొద్ది రోజుల్లోనే భయంకరమైన వరదలు చూస్తున్నాం. దీనివల్ల వర్షపాతం గణాంకాలు సాధారణంగా కనిపించినా.. భూమి లోపలికి ఇంకే నీరు, నేల తేమ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నినో వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపెడుతోంది. మానవ తప్పిదాల వల్ల పెరిగిన వేడిని మన సముద్రాలు 90 శాతానికి పైగా పీల్చుకుంటున్నాయి. సముద్రాలు నిమిషానికి, సెకనుకు పీల్చుకుంటున్న ఉష్ణశక్తి దాదాపు 12 హిరోషిమా అణుబాంబుల పేలుళ్లతో సమానం. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. శాస్త్రీయంగా దీన్ని సూపర్ ఎల్ నినో గా పిలుస్తారు. దీని ప్రభావంతో 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉంది. ఇది మనదేశంలో తీవ్రమైన వేడిగాలులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది.
రుతుపవనాల అసమతుల్యత మనదేశ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వర్షాల రాక ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో అసలు పడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది జూలై మధ్యనాటికి ఖరీఫ్ సాగు విస్తీర్ణం దాదాపు 6 శాతం మేర తగ్గింది. అంటే దాదాపు 42 లక్షల హెక్టార్లలో పంటల సాగు నిలిచిపోయింది. ప్రధానంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, ప్రత్తి పంటలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో వర్షాభావంతో విత్తనాలు ఆలస్యమవ్వడం, ఆ తర్వాత హఠాత్తుగా ముంచెత్తే వరదలతో లేత మొక్కలు కుళ్ళిపోవడం జరుగుతోంది. ఇది పంట దిగుబడులపై తీవ్రంగా దెబ్బకొట్టి ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తోంది.
రాబోయే రోజుల్లో నీటి కొరత, విపరీతమైన ఎండలు మనల్ని తీవ్రంగా పరీక్షించబోతున్నాయి. దీనికోసం వచ్చే వేసవి వరకు ఆగకుండా ఇప్పటినుంచే ప్రభుత్వం, ప్రజలు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాతావరణ విపత్తుల విషయంలో చివరి నిమిషంలో నిర్ణయాలు పనిచేయవు. జలాశయాల్లో నీటి నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలి. అలాగే తక్కువ కాలంలో చేతికి వచ్చే పంటలను ప్రోత్సహించడం, సాగునీటి వినియోగంలో మార్పులు తేవడం అత్యవసరం. వైద్య రంగం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా హెల్త్ యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలి. రాబోయే సూపర్ ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే అడుగులు వేయడం చాలా ముఖ్యం.

