ఒక్కసారి ఆ ఫేమస్ రెస్టారెంట్ కిచెన్ తలుపు తెరిచి చూడండి… అక్కడ వంట జరుగుతుందో… పురుగుల కాపురం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక మూల బొద్దింకల సందడి. ఇంకో మూల ఈగల పండుగ. ఫ్రిడ్జ్ తెరిస్తే ఎప్పుడో వండిన మాంసం అక్కడే మకాం వేసుకుని ఉంటుంది. గోడలు బయటికి తెల్లగా కనిపిస్తాయి… లోపలికి వెళ్తే నల్లగా మారిన చరిత్ర కనిపిస్తుంది. గిన్నెలు ఉన్నాయి. చెంచాలు ఉన్నాయి. పొయ్యి ఉంది. అన్నీ ఉన్నాయి. శుభ్రత మాత్రం ఎక్కడుందో భూతద్దంలో వెతకాలి. ఇది మనం డబ్బులు పెట్టి తినడానికి వెళ్లే రెస్టారెంట్ కిచెన్ కథ అయ్యుండొచ్చు.
దేశంలోని 244 జిల్లాల నుంచి 91 వేలకుపైగా స్పందనలు సేకరించిన లోకల్ సర్కిల్స్ సర్వేలో 57శాతం మంది చెప్పిన విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. 2025లో రెస్టారెంట్లలో మురికిగా ఉన్న డైనింగ్ ఏరియాలు, కిచెన్లు లేదా వాష్రూమ్లను స్వయంగా చూశామని వారంతా చెప్పారు. అంటే 10 మందిలో దాదాపు ఆరుగురు ఇదే విషయాన్ని చెప్పారు. రెస్టారెంట్లో భోజనం చేయడానికి వెళ్లి వీరంతా ఫుడ్ కంటే ముందు మురికిని చూశారట. 53శాతం మంది సిబ్బంది పరిశుభ్రత లేకుండా ఆహారాన్ని వడ్డించడం చూశారు.
మరో 53శాతం మంది వంట నూనెను మళ్లీ మళ్లీ వాడటం గమనించారు. 50శాతం మంది సురక్షితమైన ఆహార వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ పాత్రల్లో ఫుడ్ను వేడి చేయడం చూశారు. 45శాతం మందికి బొద్దింకలు, ఎలుకలు, ఈగలు దర్శనమిచ్చాయి. 45శాతం మంది వెజ్, నాన్ వెజ్ ఆహారాలు కలిసిపోయే ప్రమాదాన్ని చూశారు. 40శాతం మంది పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వడ్డించడం గమనించారు.
ఇన్ని కథలు విన్నాక ఒక చిన్న ఆశ మిగులుతుంది కదా… ఇవేవీ చూడని వాళ్లు ఎంతమంది ఉన్నారు? కేవలం 5శాతం. అంటే 100 మందిలో 95 మంది కనీసం ఒక్క సమస్యనైనా తమ కళ్లతో చూశారన్నమాట. ఇప్పుడు మరో విచిత్రమైన విషయం. కస్టమర్లకు భయం కలిగిస్తున్న వాటిలో మొదటి స్థానంలో 79శాతంతో మురికి కిచెన్లు, డైనింగ్ ఏరియాలు, వాష్రూమ్లు ఉన్నాయి.
74శాతం మందికి పాత ఆహారాన్ని మళ్లీ వడ్డించడం భయం. 72శాతం మందికి అదే నూనెను తిరిగి తిరిగి వాడటం భయం. 63శాతం మందికి గడువు ముగిసిన లేదా సరిగ్గా నిల్వ చేయని పదార్థాల భయం. 61శాతం మందికి పురుగులు, ఎలుకలు మాత్రమే కాదు… సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత కూడా భయమే. 60శాతం మందికి సురక్షితం కాని ప్లాస్టిక్ పాత్రల్లో ఫుడ్ వేడి చేయడం ఆందోళన. కస్టమర్కు కనిపించే బొద్దింకను చూసి భయపడొచ్చు. కానీ కనిపించని పాత నూనెను ఎలా చూస్తారు? వాష్రూమ్ మురికిగా ఉంటే వెళ్లిపోవచ్చు. కానీ నిన్న మిగిలిన ఫుడ్ ఈరోజు మీ ప్లేట్లోకి వచ్చిందో ఎలా తెలుసుకుంటారు?కిచెన్ గోడ నల్లగా ఉంటే అనుమానం రావచ్చు. నీ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులుగా ఏం పడుకుని ఉందో ఎవరు చెబుతారు?
అందుకే 74శాతం మంది ఒక సింపుల్ డిమాండ్ చేశారు. రెస్టారెంట్ హైజీన్ రేటింగ్ను దాచిపెట్టొద్దు. బయటే పెట్టండి. ఫుడ్ డెలివరీ యాప్లో కూడా చూపించండి. 72శాతం మంది మూడు నెలలకోసారి తనిఖీలు కావాలన్నారు. 71 శాతం మంది పదేపదే తప్పులు చేసే రెస్టారెంట్లపై కఠినమైన చర్యలు కోరారు.
ఇక 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో పరీక్షించిన 2,23,808 ఫుడ్ శాంపిళ్లలో 40,023 సాంపిళ్లు సురక్షితం కాదని, నాణ్యతలో లోపాలున్నాయని లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని తేలింది. దాదాపు ప్రతి ఐదు శాంపిళ్లలో ఒకటి. ఇంతకీ మనం రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఏం చూస్తున్నాం? ఇంటీరియర్ చూస్తున్నాం. లైట్లు చూస్తున్నాం. ఏసీ చూస్తున్నాం. ప్లేట్ మీద అలంకరణ చూస్తున్నాం. కానీ ఆ ప్లేట్ మన దగ్గరకు రావడానికి ముందు అది దాటిన కిచెన్ను మాత్రం చూడలేం.
దేశంలో FSSAI హైజీన్ రేటింగ్ వ్యవస్థ ఉంది. ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఉంటుంది. కానీ అది స్వచ్ఛందం. చాలా రెస్టారెంట్లలో అది కనిపించదు. అంటే మనం తినబోయే ఆహారానికి ధర తెలుసు. రుచి ఎలా ఉంటుందో రివ్యూల్లో తెలుసు. అక్కడ ఎంత మంచి ఫొటో దిగొచ్చో కూడా తెలుసు. కానీ ఆ వంటగదిలో శుభ్రతకు ఎన్ని మార్కులో మాత్రం తెలియదు. బయట తెల్లని గోడలు. లోపల నల్లని మూలలు. టేబుల్ మీద వేడి వేడి భోజనం.
వంటగదిలో మాత్రం పాత నూనె, పాత ఆహారం, పురుగుల కాపురం. ఇది ప్రతి రెస్టారెంట్ కథ కాదు. కానీ ఇది ఎక్కడో జరుగుతున్న కథ కూడా కాదు. మన నగరాల్లో… మనం రోజూ వెళ్లే రెస్టారెంట్లలో… మన కళ్లకు కనిపించని మరో ప్రపంచం ఉండొచ్చని ఈ లెక్కలు చెబుతున్నాయి. చివరికి ప్రశ్న ఒక్కటే. రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసేది ఫుడ్ మాత్రమేనా? లేదా బయట మెరుస్తున్న గోడల వెనక దాక్కున్న ఒక నిజాన్ని కూడా ప్లేట్లోకి ఆర్డర్ చేస్తున్నామా?

