Explanier: కమ్యూనిజమే మానవాళికి మార్గమని బడాయిపోయే చైనా..తన సొంత దేశంలోని మైనారిటీల హక్కులను కాలరాస్తోంది. ఒక మతాన్ని, ఒక భాషను, ఒక సంస్కృతిని తుడిచివెయ్యాలని చూస్తోంది. అవునండి..! చైనాలోని ఉయ్గర్ ముస్లింల గురించి ప్రపంచం మరోసారి మాట్లాడుతోంది.
జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎథ్నిక్ యూనిటీ చట్టం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఐక్యత పేరుతో ఉయ్గర్ ప్రత్యేక గుర్తింపునే చెరిపేసే ప్రయత్నమని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ చైనా తీసుకొచ్చిన ఈ చట్టంలో ఏముంది? ఉయ్గర్ ముస్లింలు ఎవరు? చైనా ఎందుకు వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది?
ఉయ్గర్లు (వీగర్లు) అంటే ఎవరు?
ముస్లిం మతాన్ని అనుసరించే టర్కిక్ జాతికి చెందిన ప్రజలే ఉయ్గర్లు. వీరి నివాస ప్రాంతం చైనా వాయువ్యంలోని షింజియాంగ్. ఉయ్గర్లు మాత్రం ఈ ప్రాంతాన్ని తూర్పు టర్కిస్తాన్గా పిలుచుకుంటారు. తమకు వేల ఏళ్ల చరిత్ర, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక గుర్తింపు ఉందని చెబుతుంటారు. అయితే బీజింగ్ మాత్రం షింజియాంగ్ ఎప్పటి నుంచో చైనాలో అంతర్భాగమేనని వాదిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.
ప్రపంచ పటంలో చూస్తే షింజియాంగ్ చైనాకు అత్యంత కీలకమైన ప్రాంతం. ఇది కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, పాకిస్థాన్, భారత్, మంగోలియా, రష్యా, ఆఫ్ఘనిస్థాన్ సహా ఎన్నో దేశాలకు సరిహద్దుగా ఉంది. చమురు, సహజ వాయువు, బొగ్గు లాంటి అపార సహజ వనరులు ఇక్కడ ఉన్నాయి. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా ఇదే ప్రధాన ద్వారం. అందుకే ఈ ప్రాంతంపై బీజింగ్ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన నియంత్రణ కొనసాగిస్తోంది. కానీ ఈ నియంత్రణ క్రమంగా అణచివేతగా మారిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 2017 నుంచి లక్షలాది మంది ఉయ్గర్లను నిర్బంధ శిబిరాలకు తరలించారని, అక్కడ రాజకీయ భావజాల శిక్షణ పేరుతో వారి మత విశ్వాసాలను మార్చే ప్రయత్నం జరిగిందని అనేక నివేదికలు చెబుతున్నాయి.
శ్రమదోపిడి, నిర్బంధం, పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం, మసీదుల కూల్చివేత, ఉయ్గర్లు భాష వినియోగాన్ని పరిమితం చేయడం లాంటి ఆరోపణలు కూడా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలన్నింటినీ చైనా పూర్తిగా తిరస్కరిస్తోంది. ఇవన్నీ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి, తీవ్రవాదాన్ని నిరోధించడానికి చేపట్టిన చర్యలేనని చెబుతోంది. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరేలా ఎథ్నిక్ యూనిటీ చట్టాన్ని తీసుకొచ్చింది.
చైనా ఐక్యత చట్టంలో ఏముంది?
జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం దేశంలో జాతి ఐక్యతను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని చైనా చెబుతోంది. అయితే జాతి ఐక్యతను దెబ్బతీయడం అంటే ఏంటో ఈ చట్టంలో స్పష్టంగా నిర్వచించలేదు. దీంతో ప్రభుత్వాన్ని విమర్శించడం, ఉయ్గర్ భాషను ప్రోత్సహించడం, తమ సంస్కృతిని కాపాడాలని కోరడం కూడా చట్ట విరుద్ధంగా పరిగణించే అవకాశం ఉందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు చైనా సరిహద్దులు దాటి కూడా అమలు కావచ్చని అధికారుల వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
విదేశాల్లో ఉండే ఉయ్గర్ కార్యకర్తలు, మానవ హక్కుల కోసం గళమెత్తే వారిపై కూడా ఈ చట్టాన్ని చూపించి ఒత్తిడి తీసుకురావచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉయ్గర్ సంఘాలు రోడ్లపైకి వచ్చాయి. బెర్లిన్ నుంచి లండన్ వరకు, వాషింగ్టన్ నుంచి టోక్యో వరకు నిరసనలు జరిగాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు.
మరోవైపు మానవ హక్కుల సంస్థలు ఇది కేవలం కొత్త చట్టం కాదని, ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలకు మరింత బలమైన చట్టబద్ధత కల్పించే ప్రయత్నమని హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇతర దేశాల్లో మైనార్టీ హక్కుల కోసం గళమెత్తే కమ్యూనిస్టులు తమ సొంత పాలన ఉన్న దేశంలో మాత్రం ఓ జాతి ఉనికినే చెరిపేసే కుట్రకు తెరలేపడం హిపోక్రసీగానే కనిపిస్తోంది.

