Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్‌ కారణం?

Winston Churchill

Winston Churchill

1943…ప్రాంతం బెంగాల్..! ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు నేలపై కదలకుండా పడుకుని ఉండేవారు. తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువులు ఎముకల గూడులుగా మారిపోయేవారు. పొలాల్లో పంటలు కనిపించినా వాటిని కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఉండేది కాదు. నగర వీధుల్లో నడిచే ప్రతి అడుగుకూ ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటిస్తూ చివరి శ్వాస తీసుకున్న మనుషులు రోడ్ల పక్కనే కుప్పకూలిపోయేవారు. ఇదంతా గతమే కానీ.. నాటి బాధ, ఆ ఆకలి, ఆ మరణాల కథ మళ్లీ ఇప్పుడు బ్రిటన్‌లో పెను దుమారానికి కారణమైంది.

హెలెన్ కామాక్ వీడియో ఇన్‌స్టాలేషన్‌లో ఏముంది?

లండన్‌లోని నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో ఒక వీడియో ఇన్‌స్టాలేషన్ ప్రదర్శించారు. టర్నర్ ప్రైజ్ విజేత హెలెన్ కామాక్ రూపొందించిన ఆ కళాఖండంలో బెంగాల్ కరువు ప్రస్తావన వచ్చింది. అందులో నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ భారతీయులను ఉద్దేశపూర్వకంగా ఆకలితో చంపాడనే మీనింగ్‌ వచ్చేలా ప్రదర్శన జరగడంతో బ్రిటన్‌లో రాజకీయ వివాదం చెలరేగింది. చర్చిల్ మనవడు నికోలస్ సోమ్స్ సహా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు చెందిన 50మందికిపైగా సభ్యులు వీడియో ఇన్‌స్టాలేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చరిత్రను వక్రీకరించడమేనని ఆరోపించారు.

బెంగాల్ కరువుకు తుఫాన్లు, యుద్ధ పరిస్థితులు, సరఫరా సమస్యలే ప్రధాన కారణాలని వాదించారు. కానీ మరోవైపు హెలెన్ కామాక్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పని చారిత్రక డాక్యుమెంటరీ కాదని, నాటి పరిస్థితులను వివరించే ప్రయత్నమని చెప్పింది. చివరకు వివాదం పెరగడంతో ఆ వీడియోను గ్యాలరీ నుంచి తొలగించారు. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంతకీ 80ఏళ్ల క్రితం జరిగిన ఒక కరువు గురించి బ్రిటన్ ఇప్పటికీ ఎందుకు అసహనంగా స్పందిస్తోంది? అసలు 1943లో బెంగాల్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు తెలుసుకోని తీరాలి.

×
×
Ad

వీక్లి న్యూస్‌పేపర్ People’s Warలో ప్రచురితమైన నాటి బెంగాల్ కరువు కథనం

1943 బెంగాల్‌లో ఏం జరిగింది?

నాడు కోల్‌కతా వీధుల్లో ఉదయం సూర్యుడు ఉదయించేలోపు మున్సిపల్ కార్మికులు బయలుదేరేవారు. చెత్త కోసం కాదు. రాత్రికి రాత్రే ఆకలితో చనిపోయిన మనుషుల శవాలను సేకరించడం కోసం. కొన్ని వీధుల్లో శవాల పక్కనే ఇంకా ప్రాణాలతో ఉన్నవాళ్లు పడుకుని ఉండేవారు. ఎవరు చనిపోయారో, ఎవరు బతికున్నారో గుర్తించడం కూడా కష్టంగా మారిపోయేది.

ఆకలి మనిషిని ఎంత దారుణంగా మార్చేస్తుందో ఆ రోజులు చూశాయి. చేతిలో ఉన్న బంగారం అమ్మేశారు. భూములు అమ్మేశారు. ఇళ్లు అమ్మేశారు. చివరకు అమ్ముకోవడానికి ఏమీ మిగల్లేదు. కొందరు అడవుల్లోకి వెళ్లి ఆకులు తిన్నారు. కొందరు చెట్ల బెరడును ఉడికించి తిన్నారు. కొందరు రోజుల తరబడి కడుపులో ఏమీ పడక నేలమీద కూలిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలామంది మరణించే ముందు ఏడిచే శక్తిని కూడా కోల్పోయారు.

కళ్లలో కన్నీళ్లు లేవు. గొంతులో శబ్దం లేదు. కడుపు లోపల మండుతున్న ఆకలి మాత్రమే ఉంది. పిల్లల పొట్టలు ఉబ్బిపోయాయి. చేతులు కాళ్లు కర్రల్లా మారిపోయాయి. ముఖాలపై మాంసం కరిగిపోయింది. ఒకప్పుడు పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు గోడకు ఆనుకుని కూర్చోవడానికి కూడా శక్తిలేక వణికిపోయేవారు.

Helen Cammock(File)

చరిత్రకారుల అంచనా ప్రకారం నాటి కరువు కారణంగా 30 లక్షలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ సంఖ్య కంటే వారి బాధ మరింత పెద్దది. ఎందుకంటే ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం ఉంది. ఒక తల్లి ఉంది. ఒక బిడ్డ ఉన్నాడు. ఒక జీవితం ఉంది. నాటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ రెండో ప్రపంచ యుద్ధంలో గెలవడం కోసమే ఇలా చేశాడనే ఆరోపణలున్నాయి. ఆహార కొరతకు యుద్ధ పరిస్థితులు, బర్మా పతనం, తుఫాన్లు, సరఫరా వ్యవస్థ వైఫల్యాలు కారణమని కొందరు చరిత్రకారులు చెబుతారు.

మరోవైపు చర్చిల్ ప్రభుత్వ నిర్ణయాలు పరిస్థితిని మరింత విషమం చేశాయని విమర్శకులు ఆరోపిస్తారు. బ్రిటిష్ పాలకులు భారత ప్రజల కంటే యుద్ధ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారని చెబుతుంటారు. అప్పటి అధికారిక రికార్డులు, చరిత్ర పుస్తకాలు చూస్తే బెంగాల్‌లో ఆహార కొరతపై హెచ్చరికలు వచ్చినా కూడా తగిన చర్యలు ఆలస్యంగా జరిగాయని తెలుస్తోంది. ప్రజలు ఆకలితో చనిపోతుండగా ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆహారాన్ని బ్రిటన్ తన సైనికుల కోసం ఉపయోగించిందని బలగుద్ది మరీ సాక్ష్యాలతో బయటపెట్టినవారు కూడా ఉన్నారు.

అందుకే చర్చిల్ పేరు ఇప్పటికీ చరిత్రలో రెండు రూపాల్లో కనిపిస్తుంది. ఒకరికి అతడు యుద్ధ వీరుడు. మరొకరికి అతడు లక్షలాది మందిని చంపేసిన కరుడుకట్టిన ఉన్మాది.. బహుశా అందుకేనేమో… 1943లో బెంగాల్ వీధుల్లో వినిపించిన ఆ ఆకలి కేకల చావులు.. 2026లోనూ లండన్ ఆర్ట్ గ్యాలరీ గోడల మధ్య కూడా ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి.