VJA CHEPPULA DANDA: ఆ పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయురాలు గతి తప్పింది. క్రమశిక్షణ పేరుతో ఆమె చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది శిక్షా..? క్రమశిక్షణా? అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒకవేళ పిల్లలు మానసికంగా ఇబ్బంది పడి ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఇంతకీ హెడ్ వెయిట్తో ఆ హెడ్మాస్టర్ చేసిన పనేంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇది కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఉన్న విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల. ఇక్కడే క్రమ శిక్షణ పేరుతో ప్రధాన ఉపాధ్యాయురాలు చేసిన అరాచకం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ స్కూలులో పదవ తరగతి చదువుతున్న సుమారు ఆరుగురు విద్యార్థుల మెడలో పాఠశాల ప్రిన్సిపల్ కనక లక్ష్మీ వారి చెప్పులను తాడుతో కట్టి వాళ్ల మెడలోనే వేయించారు. ఈ విషయాన్ని అందులో ఒక విద్యార్థిగా ఉన్న ఊకోటి వంశీకృష్ణ తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడటంతో విషయం బయటకు పొక్కింది. స్కూల్లో జరిగిన ఘటనపై వంశీకృష్ణ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. అదేవిధంగా ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారి పద్మారాణిని విచారణ నిమిత్తం పాఠశాలకు పంపించారు. విజయసాయి పాఠశాలలో ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ఇందులో ఆరుగురు విద్యార్థుల మెడలో చెప్పులు వేసినట్టుగా గుర్తించారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రాధమిక నివేదిక రూపంలో అందజేశారు.
Read Also: Raakasa: ట్రెండీ లిరిక్స్తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తాము ఈ విధంగా చేసినట్టుగా ప్రిన్సిపల్ కనక లక్ష్మీ ఒప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా స్కూలు నడుస్తోందని తాను 24 ఏళ్లుగా టీచర్గా పని చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు యూనిఫాంలో భాగంగా షూస్ వేసుకురావటం లేదని చెప్పులతో వస్తున్నారని వీళ్లను చూసి మిగతా విద్యార్థులు కూడా యూనిఫామ్ నిబంధనలు పాటించటం లేదని ఆమె చెప్పారు. అందుకే షూస్ వేసుకు రాని విద్యార్థుల చెప్పులను వాళ్ల మెడలోనే వేయించి క్లాస్ రూమ్లో ఉంచామని ఆమె వివరించారు. అంతే తప్ప విద్యార్థులను అవమానించాలన్న ఉద్దేశం లేదన్నారు. క్రమశిక్షణలో పెట్టాలని ఇలా చేశానని చెప్పుకొచ్చారు.
విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం అంటే చెప్పులను మెడలో వేయటం కాదంటున్నారు వంశీకృష్ణ తండ్రి. తన కుమారుడు ఈ ఘటనతో కలత చెందాడని తమకు చెప్పకుండా ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరిపి డీఈఓ కి నివేదికను ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పద్మారాణి తెలిపారు. ఆ తర్వాత ఘటనపై చర్యలు తీసుకుంటారని ఆమె వివరించారు. అసలే పసి మనసులు.. ఆ విద్యార్థులవి. అలాంటి వాళ్లపై క్రమశిక్షణ పేరుతో మానసికంగా దెబ్బకొడుతున్న ప్రిన్సిపల్కు ఏం శిక్ష వేయాలి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
